
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శ్వాసకోశ సమస్యల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్(ఐఎల్ఐ) కేసులు ఫిబ్రవరిలో 11,624 నమోదైతే, ఈ నెలలో గడిచిన 15 రోజుల్లోనే 5,994 కేసులు నమోదయ్యాయి. గత నెల 65 స్వైన్ఫ్లూ కేసులు నమోదవగా, ఈ నెలలో ఇప్పటివరకు 39 మందికి స్వైన్ఫ్లూ(హెచ్1ఎన్1) పాజిటివ్ వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో జనాలను భయపెడుతున్న హెచ్3ఎన్2 కేసులు, మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఐఎల్ఐ కేసులు నమోదవుతున్నాయని, వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని స్టేట్ హెల్త్ సెక్రటరీ రిజ్వీకి కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ గురువారం లేఖ రాశారు. తెలంగాణలో ఈవారం 267 కేసులు నమోదయ్యాయని, టెస్ట్ పాజిటివిటీ రేటు 0.31 శాతానికి పెరిగిందన్నారు. టెస్టుల సంఖ్యను పెంచాలని, ట్రేసింగ్ చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న వేరియంట్ ఏదో తెలుసుకునేందుకు పాజిటివ్ వ్యక్తుల శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలన్నారు. ఎక్కువ మంది గుమిగూడే ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
గురువారం 27 మందికే..
గడిచిన వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం 267 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. అయితే గురువారం 27 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది.
ఆందోళన అక్కర్లేదు
ఇన్ఫ్లూయెంజా, కొవిడ్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేం అప్రమత్తంగా ఉన్నాం. ఇన్ఫ్లూయెంజా లక్షణాలతో వచ్చే వాళ్లందరికీ టెస్టులు చేయిస్తున్నాం. మన స్టేట్లో ఇప్పటివరకు హెచ్3ఎన్2 కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. వాతావరణ మార్పుల వల్ల దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలో డిసెంబర్ నుంచి ఐఎల్ఐ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డిసెంబర్తో పోలిస్తే జనవరి, ఫిబ్రవరిలో తక్కువ కేసులే వచ్చాయి.
-డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్