
ఒకరికి చేయాల్సిన ఆపరేషన్ మరొకరికి
ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న మహిళకు ప్రసవం శిశువు మృతి.. తల్లి పరిస్థితి సీరియస్
తప్పులతడకగా ఉన్న కేస్ షీట్..ఆపరేషన్ అయిన మహిళకు బదులు మరొకరి పేరు
మగ బిడ్డ పుడితే.. ఆడ బిడ్డ అని రాశారు
చిలకలగూడ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు
పద్మారావునగర్(హైదరాబాద్), వెలుగు: ఓ గర్భిణికి చేయాల్సిన ఆపరేషన్ మరో గర్భిణికి చేశారు గాంధీ ఆస్పత్రి డాక్టర్లు. ప్లేట్ లెట్స్ తగ్గాయని వచ్చిన మహిళకు ఏడో నెలలోనే ప్రసవం చేయడంతో శిశువు మృతి చెందగా.. తల్లి పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ ఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, నలుగురు డాక్టర్లతో కమిటీ వేసిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు..
ప్లేట్ లెట్స్ తగ్గాయని వస్తే..
మహబూబాబాద్ జిల్లా వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన సమత ఏడు నెలల గర్భిణి. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆమెను కొద్ది రోజుల క్రితం వరంగల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఈ నెల 11న గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే భవానీ అనే తొమ్మిది నెలల గర్భిణికి చేయాల్సిన ప్రసవాన్ని సమతకు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నెల 12న సమత ఆరోగ్య స్థితిని పరిగణనలోనికి తీసుకుని సిజరేయన్ చేసి బిడ్డను తీశామని, మగ బిడ్డ పుట్టాడని, 900 గ్రాముల బరువు ఉండటంతో శిశువును ఐసీయూలో ఉంచామని సిబ్బంది తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. 13న శిశువు చనిపోయిందని చెప్పగా ఖననం చేసేశామని సమత భర్త హరీష్ తెలిపారు.
తప్పుల తడకగా కేస్ షీట్?
మంగళవారం సమతను డిశ్చార్జ్ చేసే సమయంలో డాక్టర్లు ఇచ్చిన కేస్ షీట్లో సమత పేరుకు బదులు భవాని అని, మగ బిడ్డ స్థానంలో ఆడ శిశువు అని రాసి ఉందని హరీష్ ఆరోపించారు. సమతకు చేతికి కట్టిన ట్యాగ్లో కూడా భవాని పేరే ఉందని అతడు చెప్పాడు. కాగా, మంగళవారం సాయంత్రం సమతకు బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఓ పీజీ స్టూడెంట్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ఆమె కాళ్లు, చేతులు ఉబ్బిపోయాయని హరీష్ చెప్పారు. ప్రస్తుతం సమత పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీనిపై సమత కుటుంబ సభ్యులు మంగళవారం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ బాలగంగిరెడ్డి గాంధీ హాస్పిటల్లో దర్యాప్తు చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు.
నలుగురు డాక్టర్లతో కమిటీ
పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హాస్పిటల్ స్పష్టం చేసింది. నలుగురు డాక్టర్లతో కమిటీ వేశామని, ఆ కమిటీ బుధవారం రిపోర్ట్ ఇస్తుందని, డాక్టర్ల పొరబాటు ఉందని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన గైనకాలజిస్ట్ వార్డుకు వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి, వారి వాదనలు విన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, డాక్టర్ల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. బాధితురాలిని పోస్ట్ ఆపరేటివ్ వార్డు నుంచి ఎంఐసీయూ వార్డుకు తరలించామని చెప్పారు. డాక్టర్ల నిర్లక్ష్యం ఏమీలేదని, విచారణలో వాస్తవాలు తేలుతాయని అన్నారు.