దుబ్బాకలో తేల్చేది చీలిక ఓట్లే..వాటిపైనే పార్టీల ఫోకస్

దుబ్బాకలో తేల్చేది చీలిక ఓట్లే..వాటిపైనే పార్టీల ఫోకస్
  • క్యాండిడేట్ల ఎంపికతో మారిన సీన్
  • మొన్నటి వరకు సెంటిమెంట్ పై గురి
  • ఇప్పుడు అసంతృప్తుల చేరికలపై దృష్టి
  • నేటి నుంచే నామినేషన్లు

దుబ్బాక బై ఎలక్షన్​లో ప్రధాన పార్టీలన్నీ చీలిక ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి. క్యాండిడేట్లు ఎవరన్నది తేలడంతో ఇక్కడ ఒక్కసారిగా సీన్​ మారిపోయింది. మొన్నటివరకు సెంటిమెంట్​పై  దృష్టి పెట్టిన పార్టీలు.. ఇప్పుడు చీలిక ఓట్లపై నజరేశాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమవైపు తిప్పుకునే పనిలో టీఆర్​ఎస్​ పడింది. గత ఎన్నికలతో పోలిస్తే దూకుడుగా ఉన్న బీజేపీ.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్​ ఓటు బ్యాంక్​పై ఫోకస్​ పెట్టింది. ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌లో ఉన్న శ్రీనివాస్​రెడ్డిని పార్టీలోకి  చేర్చుకొని.. టికెట్ ఇవ్వడం తమకు ప్లస్​ అవుతుందని, అధికార పార్టీ ఓట్లు చీలి లాభం జరుగుతుందని కాంగ్రెస్​ భావిస్తున్నది.

హైదరాబాద్‌, వెలుగుఎలక్షన్​ షెడ్యూలు విడుదలైనప్పటి నుంచే దుబ్బాకలో పొలిటికల్​ హీట్​ జోరందుకుంది. స్థానిక టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నది. శుక్రవారం  నుంచి నామినేషన్లు స్టార్ట్​ కానున్నాయి. నవంబర్​ 3న పోలింగ్​ ఉంటుంది. ఇప్పటికే  టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ ఒకళ్లకు మించి ఒకళ్లు  అన్నట్లుగా క్యాండిడేట్లను ఎంపిక చేసిన తీరుతో ఈ ఎన్నిక  ఆసక్తికరంగా మారింది.

గ్యాప్‌ పూడ్చుకునే పనిలో టీఆర్‌ఎస్‌

తమ ఎమ్మెల్యే చనిపోవటంతో.. అదే కుటుంబాన్ని పోటీకి దింపాలని టీఆర్​ఎస్​ ముందే డిసైడయింది. సోలిపేట రామలింగారెడ్డి కుమారుడికే మొదట టికెట్  ఇవ్వాలనుకుంది. అయితే.. ఆయనపై సోషల్‌ మీడియాలో సాగిన ప్రచారంతో వెనక్కి తగ్గింది. సెంటిమెంట్​తో పాటు మహిళల ఓట్లను దృష్టిలో పెట్టుకొని రామలింగారెడ్డి భార్య సుజాతను క్యాండిడేట్‌గా ఖరారు చేసింది. ఆమె తరఫున మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన నేతలను టీఆర్‌ఎస్‌ వైపు తీసుకువచ్చేందుకు హరీశ్‌రావు ప్రయత్నాలు ప్రారంభించారు. అదే టైంలో టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు నేతలు దూరమవడంతో.. బీజేపీ, కాంగ్రెస్​లోని అసంతృప్తులను చేర్చుకొని ఆ గ్యాప్‌ను భర్తీ చేయడంపై దృష్టి పెట్టారు.కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్​ చెరుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి స్వగ్రామానికి చెందిన డీసీసీ కార్యదర్శి చెరుకు కొండల్‌‌‌‌రెడ్డిని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేర్చుకున్నారు. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలను గులాబీ గూటికి తీసుకువచ్చారు. దీంతో ఇతర పార్టీల నుంచి లీడర్లతో పాటు.. వాళ్ల ఓట్లలో  చీలికి వచ్చి తమకు కలిసి వస్తుందని టీఆర్​ఎస్​ భావిస్తున్నది.

రెండు పార్టీలపై బీజేపీ ఫోకస్​

బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్‌‌‌‌రావు రెండు నెలలుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు వెళ్లి తనకు ఓటు వేయాలని ప్రజలను అడుగుతున్నారు. యూత్​లో ఆయనకు మంచి ఫాలోయింగ్‌‌‌‌ ఉంది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌  నుంచి ఎక్కువ మంది నాయకులను ఆయన బీజేపీ వైపు తిప్పుకోగలిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో ఈసారి ఇతర పార్టీల వారి చేరికలపై ఫోకస్​ పెట్టారు.  రామలింగారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  నేతలు పలువురు ఇప్పటికే బీజేపీకి చేరువవగా.. కాంగ్రెస్‌‌‌‌ నుంచి కొందరు బీజేపీ కండువా కప్పుకున్నారు. స్వయంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్​ సోలిపేట సుజాత స్వగ్రామం చిట్టాపూర్‌‌‌‌ ఎంపీటీసీతోపాటు కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి సొంతూరు తుక్కాపూర్‌‌‌‌ సర్పంచ్‌‌‌‌ బీజేపీలో చేరారు. దీంతో రెండు పార్టీల ఓటు బ్యాంకుకు గండి పడి, అక్కడ చీలే ఓట్లు తమకు మద్దతుగా ఉంటాయని బీజేపీ నమ్మకంతో ఉంది.

శ్రీనివాస్​రెడ్డి ఎంట్రీతో కాంగ్రెస్​లో ఉత్సాహం

టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  టికెట్‌‌‌‌ ఆశించి భంగపడిన చెరుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్‌‌‌‌లో చేరి టికెట్‌‌‌‌ తెచ్చుకున్నారు. ఆయనతోపాటు  మద్దతుదారులు కూడా టీఆర్​ఎస్​ను వదిలి కాంగ్రెస్​తో జట్టుకట్టారు. తన తండ్రి మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డితో సన్నిహితంగా ఉండే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  నేతలందరినీ అనుకూలంగా మలుచుకునేందుకు  శ్రీనివాస్​రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంతకాలం సోలిపేట రామలింగారెడ్డికి వ్యతిరేక వర్గంగా ఉన్న నేతలపైనా దృష్టి పెట్టారు. ఇన్నాళ్లూ టీఆర్ ఎస్​లో ఉన్న వ్యక్తిని తాము క్యాండిడేట్​గా బరిలోకి దింపటం కలిసివస్తుందని కాంగ్రెస్​  నమ్ముతున్నది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతతోపాటు ఓట్లు చీలి తమ ఖాతాలో పడతాయని లెక్కలు వేసుకుంటున్నది.

నేతల వెంటే కేడర్ వలసలు

దుబ్బాక నియోజకవర్గంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. 20 రోజులుగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ నేతలు పోటాపోటీగా నేతలను తమ తమ పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్‌‌‌‌ ఆలస్యంగా రంగంలోకి దిగడంతో ఆ పార్టీలో చేరికలు పెద్దగా మొదలు కాలేదు. ఇప్పటి వరకు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌ నుంచి బీజేపీలోకి ఎక్కువ చేరికలు ఉండగా.. కాంగ్రెస్‌‌‌‌లోని కొందరు అసంతృప్తులు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గూటికి చేరారు. పార్టీ మారుతున్న నేతలతో పాటే కేడర్‌‌‌‌ కూడా కండువాలు మార్చుతున్నారు. చెరుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డి వెంటే ఆయన వర్గీయులంతా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఇలా పార్టీని వీడి మరో పార్టీలో చేరే నేతల ద్వారా వచ్చే ఓట్లపైనే అన్ని పార్టీలు దుబ్బాకలో గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలున్నాయి.