- ఐదేళ్ల కిందట రూ. 85,390 కోట్ల లాస్.. 2021–22 లో రూ.66,539 కోట్ల ప్రాఫిట్
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లాభం వస్తుందని అంచనా
- ప్రైవేట్ బ్యాంకులతో పోటీకి సై
- ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే మంచి ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ బ్యాంకు(పీఎస్బీ) ల దశ దిశ మారింది. దేశంలోని 21 పీఎస్బీలు 2017 లో నికరంగా రూ. 85,390 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, 2021–22 లో రూ.66, 539 కోట్ల లాభాన్ని సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ. లక్ష కోట్లను మైలురాయిని అందుకుంటుందని అంచనా. ఐదేళ్ల కిందట 21 పీఎస్బీలలో 11 బ్యాంకులు ఆర్బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) ఫ్రేమ్వర్క్ కింద ఉండేవి. ప్రస్తుతం ఏ బ్యాంక్ కూడా పీసీఏ కింద లేదు. ఫైనాన్షియల్గా అధ్వాన్నంగా మారిన బ్యాంకులపైన పీసీఏ రిస్ట్రిక్షన్లు పెడతారు. ఇందులో భాగంగా బ్యాంకులు కొత్తగా డిపాజిట్లు తీసుకోవడం, లోన్లు ఇవ్వడం వంటి అంశాల్లో నియంత్రణలు ఉంటాయి. ఐదేళ్ల కిందట ప్రభుత్వ బ్యాంకుల మొండిబాకీలు సగటున 14.58 శాతానికి చేరుకున్నాయి. క్యాపిటల్ బేస్ తక్కువగా ఉండడం, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్గా లేకపోవడం, స్టాఫ్ సరిగ్గా పనిచేయకపోవడం, బ్యాంకుల పనితీరు సక్రమంగా లేకపోవడం వంటి అంశాలు ప్రభుత్వ బ్యాంకులను వెంటాడాయి. చాలా పీఎస్బీలు డీఫాల్ట్ అయ్యే స్టేజ్కి చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారాయి కూడా. పీఎస్బీ షేర్లయితే ఆల్ టైమ్ కనిష్టాల దగ్గర ట్రేడయ్యాయి. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య నికరంగా రూ.2,07,329 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. 2017–18 లో అత్యధికంగా రూ.85,370 కోట్లను ప్రకటించాయి. 2018–19 లో రూ.66,636 కోట్లను, 2019–20 లో రూ.25,941 కోట్లను, 2015–16 లో రూ.17,993 కోట్లను, 2016–17 లో రూ.11,389 కోట్ల నష్టాలను ప్రకటించాయి.
ప్రభుత్వ చర్యలతో మారిన స్టోరీ
పీఎస్బీల కథ మోడీ ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలతో మారిందని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ రాజీవ్ కుమార్లు తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ బ్యాంకులను గాడిలో పెట్టాయి. బ్యాంకులకు క్యాపిటల్ సపోర్ట్ ఇచ్చేందుకు 2016–17 నుంచి 2020–21 మధ్య రూ.3,10,997 కోట్లను ప్రభుత్వం అందించింది. క్యాపిటల్ను కూడా డైరెక్ట్గా ద్రవ్యలోటుపై ప్రభావం చూపకుండా అందించింది. చాలా బ్యాంకులు డీఫాల్ట్ కాకుండా చూసుకుంది. రీక్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ను 2017, అక్టోబర్లో ప్రకటించారు. బాండ్లను ఇష్యూ చేయడం ద్వారా బ్యాంకులకు క్యాపిటల్ను సమకూర్చారు. ఈ విధానంలో బాండ్లపై వడ్డీ భారం మాత్రమే ప్రభుత్వంపై పడుతుంది. మరోవైపు పీఎస్బీల దగ్గర లోన్లు తీసుకొని ఎగ్గొడుతున్న వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాజీవ్ కుమార్ ఫైనాన్షియల్ సెక్రెటరీగా బాధత్యలు తీసుకున్న కొన్ని రోజులకే డొల్ల కంపెనీలకు చెందిన 3.38 లక్షల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. మొండిబాకీలను రికవరీ చేయడంపై ఫోకస్ పెట్టారు. ఫలితంగా 2018–19 నాటికి మొండిబాకీలుగా మారే ఆస్తులకు, బ్యాంకుల గ్రాస్ అడ్వాన్స్లకు మధ్య రేషియో 63.9 శాతానికి తగ్గింది. 2017, సెప్టెంబర్ నాటికి ఇది 80.3 శాతంగా రికార్డయ్యింది.
బౌన్స్ బ్యాక్..
ఈ చర్యలన్నింటి వలన ప్రభుత్వ సెక్టార్ బ్యాంకులు తిరిగి పుంజుకున్నాయి. ప్రైవేట్ బ్యాంకులకు అన్ని విధాలుగా పోటీ ఇస్తున్నాయి. 2020–21 లో పీఎస్బీలు నికరంగా రూ. 31,820 కోట్ల లాభాన్ని ప్రకటించాయి. లోన్ రికవరీ మెరుగుపడడం, ఎన్పీఏలు తగ్గడం, విండ్ఫాల్ లాభాలు, బాండ్ పోర్టుఫోలియో మెరుగ్గా ఉండడం వలన ప్రభుత్వ బ్యాంకుల దశ మారింది. లాభాలు వస్తుండడంతో చాలా ఏళ్ల తర్వాత పీఎస్బీలు డివిడెండ్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఎస్బీఐ 2021–22 లో రూ.7,867 కోట్ల డివిడెండ్ను ఇచ్చింది.
బ్యాంకుల ప్రైవేటైజేషన్..
రాజకీయంగా వ్యతిరేకత వస్తుందని తెలిసినా బ్యాంకులను ప్రైవేటైజ్ చేయడానికి మోడీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఐడీబీఐలో 51 శాతం వాటాను ఎల్ఐసీకి అమ్మేసి, ఈ బ్యాంక్ను ప్రైవేట్ బ్యాంక్గా మార్చింది. వివిధ బ్యాంకులను విలీనం చేసి అతిపెద్ద బ్యాంకులుగా మార్చింది. మరికొన్ని బ్యాంకులను ప్రైవేటైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏ) ను తగ్గించడంపై డిపార్ట్ మెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్ మేనేజ్మెంట్లు దృష్టి పెట్టాయి. భూషణ్ స్టీల్, జెట్ ఎయిర్వేస్, ఎస్సార్ స్టీల్, నీరవ్ మోడీ, రోటొమాక్ వంటి పెద్ద డీఫాల్టర్ల నుంచి డబ్బులు రాబట్టేందుకు చర్యలు తీసుకున్నాయి. యెస్ బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ వంటి సంక్షోభాలు ఆర్థిక వ్యవస్థను కుదిపేయకుండా ప్రభుత్వం చూసుకుంది.
ఈ ఏడాది కూడా ప్రభుత్వ బ్యాంకులు సాలిడ్ పెర్ఫార్మెన్స్ చేస్తాయి. గత రెండేళ్ల ట్రెండ్ను గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ రూ.80,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మధ్య ఉంటుంది. క్రెడిట్ గ్రోత్, ఎన్సీఎల్టీ, ఎన్ఏఆర్సీఎల్లలో ఎన్పీఏల రికవరీ వేగం బట్టి రూ. లక్ష కోట్ల మైలురాయిని అందుకున్నా ఆశ్చర్యం లేదు. పీఎస్బీఐలు మార్కెట్లో తమ వాటాను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
- ఏఎస్ రాజీవ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎండీ