- కొత్త ఫీచర్ను తెచ్చిన డిజిట్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ పాలసీలు ఫేకా? రియలా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఓ కొత్త ఫీచర్ను క్లౌడ్ బేస్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిజిట్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. డిజిట్ పేరుతో ఇష్యూ అయిన పాలసీలు ఫేక్ లేదా రియల్ అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ సాయపడుతుంది. ఫేక్ పాలసీలను ఇష్యూ చేస్తూ కస్టమర్లను మోసం చేయడం బాగా పెరిగింది. పాలసీలను రెన్యూ చేయాల్సి ఉందని చెప్పి కస్టమర్ల నుంచి డబ్బులు కొట్టేయడం కూడా పెరిగింది. ఫేక్ పాలసీల కింద రూ. 50 కోట్లను కస్టమర్ల నుంచి మోసగాళ్లు కొట్టేశారని 2019 లో ఫైనాన్స్ మినిస్ట్రీ పేర్కొనడం గమనించాలి. డిజిట్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు రియలా? కాదా? అని చెక్ చేసుకోవడానికి కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాయి. మోటార్ పాలసీ రియలా? కాదా? అనే విషయాన్ని ప్రభుత్వ పోర్టల్ వాహన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫేక్ పాలసీలను అరికట్టేందుకు ఐఆర్డీఏఐ వివిధ చర్యలు తీసుకుంటోంది.
మోటార్, హెల్త్ పాలసీలకే..
డిజిట్ వెబ్సైట్, పార్టనర్ పోర్టల్, యాప్లో ‘పాలసీ జెన్యూనెస్ చెక్’ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మోటార్, హెల్త్ ఇన్సూరెన్స్లను ఈ ఫీచర్ కింద చెక్ చేసుకోవచ్చు. పాలసీ నెంబర్ను లేదా వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను, పాలసీ స్టార్ట్ అయిన డేట్ను ఎంటర్ చేస్తే, తాము ఈ పాలసీని ఇష్యూ చేశామా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చని డిజిట్ ప్రకటించింది. తాము ఇష్యూ చేసే డాక్యుమెంట్లపై వాటర్ మార్క్ ఉంటుందని పేర్కొంది.