వరంగల్ జిల్లా: ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో ఆందోళన బాట పట్టారు. వీఆర్ఏల సమస్యల పట్ల సీసీఎల్ఏ (CCLA) నిర్లక్ష్య వైఖరి నశించాలి.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ జీవో ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే అర్హత కలిగిన విఆర్ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. 55 సంవత్సరాల పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ అర్బన్ తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగులను అడ్డుకుని నిరసన
నిర్మల్ జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు వీఆర్ఏలు. సీఎం కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆఫీస్ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులు, సిబ్బంది ఆఫీస్ లోకి వెళ్లకుండా అడ్డుకుని తమ సమస్యలను వినిపించారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే ఆందోళనకు దిగామని తెలియజేశారు.