
మరోసారి రేట్ల తగ్గింపు?
ఎంపీసీ తగిన నిర్ణయం తీసుకుంటుంది
కరోనా కష్టాలను తగ్గిస్తాం|
ఆర్బీఐ ప్రకటన
ముంబై: ఎకానమీని, మార్కెట్లను గాడినపెట్టడానికి ఆర్బీఐ సోమవారం రెపోరేట్లను తగ్గిస్తూ ప్రకటన చేస్తుందన్న అంచనాలు నిజం కాలేదు. అయితే ప్రస్తుత సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సానుకూలంగా స్పందించారు. దీనిపై మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఎంపీసీ సమావేశం జరుగుతుందని చెప్పారు. కరోనాతో వస్తున్న ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి చాలా ప్రపోజల్స్ను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాధి వల్ల మన దేశ ఎకానమీకి కచ్చితంగా నష్టం ఉంటుందని దాస్ స్పష్టం చేశారు. తమ ఎకానమీలను రక్షించుకోవడానికి చాలా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించినందున, ఆర్బీఐ కూడా అదే బాటులో నడుస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు.
దాస్ ముంబైలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఫారెక్స్, బాండ్ మార్కెట్లకు కూడా కరోనా ఎఫెక్ట్ ఉంటుంది. సమస్యను పరిష్కరించడానికి మా దగ్గర ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. వాటిని తగిన సమయంలో అమలు చేస్తాం. ఈ నెల 23న డాలర్/రూపాయి సెల్/బయ్ స్వాప్ చేపడతాం. తక్కువ ధరలో లోన్లను అందించడానికి లాంగ్ టెర్మ్ రీఫైనాన్సింగ్ ఆపరేషన్ (ఎల్టీఆర్ఓ)కు రూ.లక్ష కోట్లు ఇస్తాం. దీనివల్ల మార్కెట్కు లిక్విడిటీ సమకూరుతుంది. ఈ విషయమై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకానమిస్ట్ దీప్తి మేరీ మాథ్యూ మాట్లాడుతూ రేట్లకు కోత పెట్టడానికి బదులు ఆర్బీఐ ఎల్టీఆర్ఓ మార్గాన్ని ఎంచుకుందని చెప్పారు. అయితే ఏప్రిల్లో రేట్లను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహాయ ప్యాకేజీల వల్ల కలిగే లాభం కొద్దిగా ఉంటుందని ఆమె అన్నారు.
యెస్ బ్యాంకుకు మేమున్నాం
యెస్ బ్యాంక్ డిపాజిటర్లు భయపడాల్సిన పనిలేదని, దీనిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సోమవారం అన్నారు. ఈ నెల 18(బుధవారం) సాయంత్రం 6 నుంచి డిపాజిటర్లు తమ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 26 న కొత్త యెస్ బ్యాంక్ బోర్డు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంకింగ్ చరిత్రలో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్(ఎస్సీబీ)ల డిపాజిటర్లు ఎప్పుడూ తమ డబ్బులను నష్టపోలేదని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. అవసరమనుకుంటే యెస్ బ్యాంకుకు లిక్విడిటీ పరంగా ఆర్బీఐ సహకరిస్తుందని అన్నారు. ఇన్వెస్టింగ్ బ్యాంకులతో చర్చించిన తర్వాత ఆర్బీఐకి నమ్మకం వచ్చిందని తెలిపారు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా సేఫ్ అని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు రాశామని తెలిపారు.
కాగా యెస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రైవేట్ బ్యాంకుల నుంచి రాష్ట్రప్రభుత్వాలు తమ మనీని విత్డ్రా చేసుకుంటున్నాయి. బ్యాంకుల విలీనాన్ని లేదా రికన్స్ట్రక్షన్ను ఆర్బీఐ చేపడుతుందని, యెస్ బ్యాంక్ను రీకన్స్ట్రక్ట్ చేయడం మంచిదని నిర్ణయించామని పేర్కొన్నారు. యెస్ బ్యాంకును గట్టేక్కించేందుకు మొదట ప్రైవేట్ ఇన్వెస్టర్ను వెతికామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ అన్నారు. కానీ అది జరగకపోయే సరికి యెస్ బ్యాంక్ రీకనస్ట్రక్షన్ స్కీమ్ను తీసుకొచ్చామన్నారు. యెస్ బ్యాంక్ను తిరిగి గాడిలో పెట్టేందుకు ఇదే సరియైన ప్లాన్ అని ఇన్వెస్టింగ్ బ్యాంకులతో సహా తాము నమ్ముతున్నామని దాస్ అన్నారు. డిపాజిటర్ల డబ్బులు భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు బ్యాంకుల నుంచి మనీని విత్డ్రా చేస్తే అది ఫైనాన్షియల్ సిస్టమ్లో పెద్ద డిజాస్టర్గా మారుతుందని ఆర్బీఐ మాజీ డిప్య్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ అన్నారు. ఇదిలా ఉంటే నిఫ్టీ ఇండెక్స్ల నుంచి యెస్ బ్యాంక్ వైదొలగనుంది. దీని స్థానంలో శ్రీ సిమెంట్ రానుంది. ఈ నెల 19 నుంచి ఈ మార్పు అమలవుతుందని ఎక్సేంజీలు తెలిపాయి.
ఈడీ ముందుకు అనిల్ అంబానీ
యెస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని ఈడీ విచారించనుంది. తమ ముందు హాజరు కావాలని ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) సోమవారం ఆదేశించింది. యెస్ బ్యాంక్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు రూ. 12,800 కోట్లను అప్పుగా ఇచ్చింది. ఇప్పుడీ అప్పులు మొండిబాకీలుగా మారాయి. ఈడీ ముందు హాజరవ్వడంపై కొన్ని మినహాయింపులను అంబానీ కోరారని ఈడీ సీనియర్ అధికారులు తెలిపారు. హాజరవ్వడానికి ఆయనే ఒక డేట్ను ఫిక్స్ చేయెచ్చన్నారు. అనిల్ అంబానీ స్టేట్మెంట్ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కింద ఈడీ రికార్డ్ చేయనుంది. ఇదిలా ఉంటే పాత బాకీలు చెల్లించడానికి కపూర్ వాద్వాన్ కంపెనీకి రూ.200 కోట్ల లోన్ ఇప్పించారంటూ ఈడీ సోమవారం కపూర్పై మరో కేసు పెట్టింది.
లాభం కోసం యెస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయడంలేదు: ఎస్బీఐ
లాభాల కోసం యెస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయలేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ సోమవారం అన్నారు. వ్యవస్థలో ఫైనాన్షియల్ స్టెబిలిటీని కొనసాగించేందుకే బ్యాంకులన్నీ కలిసి యెస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తున్నాయని తెలిపారు. ‘ఇన్వెస్ట్మెంట్లపై లాభాన్ని(ఆర్ఓఐ) ఆశించి యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టలేదు’ అని అన్నారు. యెస్ బ్యాంకులో ఎస్బీఐ రూ. 6,050 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.ఐసీఐసీఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ), యాక్సిస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్లు కూడా యెస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనున్నాయి.