హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారంతో పూర్తయ్యాయి. సచివాలయంలో ఉన్న మొత్తం 11 బ్లాక్ల కూల్చివేతల్లో భాగంగా ప్రభుత్వ సిబ్బంది సోమవారం చివరగా ఎల్ బ్లాక్ ను కూల్చివేశారు. మిగిలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శిథిలాల నుండి ఇనుము, కంకర, అల్యూమినియం, ఇతర సామాగ్రిని సిబ్బంది వేరు చేస్తున్నారు. వ్యర్ధాల తొలగింపుకు మరో నెల రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
కాగా.. సోమవారం కూల్చివేత పనులను మీడియా ప్రతినిధులు పరిశీలించారు. కూల్చివేత ప్రక్రియ మీడియా సమక్షంలో జరగాలని హై కోర్టులో పిటిషన్ దాఖలవడంతో కూల్చివేత, శిథిలాల తొలగింపు పనులకు సంబంధించి వార్తల సేకరించేందుకు అనుమతి లభించింది. దీంతో హైదరాబాద్ సీపీ నేతృత్వంలో మీడియా ప్రతినిధులు కూల్చివేత పనులను పరిశీలించారు.