ముషీరాబాద్/ఓయూ/గచ్చిబౌలి/గండిపేట, వెలుగు: మహిళల చదువు కోసం కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు మరువలేమని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కొనియాడారు. బుధవారం సావిత్రి బాయి ఫూలే 193వ జయంతి వేడుకలు తెలంగాణ జన జాగృతి ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. చీఫ్గెస్టుగా హాజరైన కిషన్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, గౌతమ్ రావు, వీహెచ్ తో కలిసి సావిత్రి బాయి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫూలే దంపతుల ఆశయ సాధన దిశగా చట్టసభల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు చట్టం తీసుకొస్తున్న ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. అనంతరం పలువురు మహిళలను సావిత్రిబాయి ఫూలే అవార్డులతో సత్కరించారు. సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని లెఫ్ట్ పార్టీల విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి జయంతిని ఆంధ్ర మహిళా సభ కాలేజీలో నిర్వహించారు. బాగ్ లింగంపల్లి
లోని కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో, గచ్చిబౌలిలోని సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో, ఐద్వా స్టేట్ ఆఫీసులో, బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో, రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ సావిత్రి బాయి ఫూలే జయంతిని నిర్వహించారు.
జనవరి 3ను అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించాలి: ప్రొఫెసర్ తిరుమలి
జనవరి 3ను అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించాలని ప్రొఫెసర్ తిరుమలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం లక్డీకాపూల్ లోని బీసీ ఈఎఫ్ భవన్లో సావిత్రిబాయి పూలే 193వ జయంతి నిర్వహించారు. ప్రొఫెసర్ తిరుమలి చీఫ్ గెస్ట్గా హాజరై మాట్లాడారు. ‘సావిత్రీబాయి పూలే జయంతిని లిటరసీ డేగా అధికారికంగా నిర్వహించి సర్కారు తన బాధ్యత చాటుకోవాలి. అప్పటి పరిస్థితులు, అడ్డంకులు ఎదుర్కొంటూ సావిత్రీ బాయి చేసిన సేవలు మరువలేం.’ అని ప్రొఫెసర్ తిరుమలి తెలిపారు.