- కుల బహిష్కరణకు గురైన బంధువు రావడంతో గ్రామస్తులు దూరం
- జగిత్యాల జిల్లా కందనకుంటలో ఘటన
జగిత్యాల టౌన్, వెలుగు: ఒక మనిషి చనిపోయినా కుల కట్టుబాట్ల నీడ అంత్యక్రియల వరకూ వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని.. గ్రామస్తులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్య, ఆడపడుచులే పాడెను మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో జరిగిన ఈ ఘటన కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న అకృత్యాలకు నిదర్శనంగా నిలిచింది. గ్రామానికి చెందిన ఎదుల రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు.
అయితే, కుల బహిష్కరణకు గురైన మృతుడి బంధు వు ఒకరు చివరి చూపు కోసం వచ్చాడు. దీంతో కుల బహిష్కరణకు గురైన వ్యక్తితో కలిసి అంత్యక్రియల్లో పాల్గొంటే కుల పెద్దల ఆగ్రహానికి గురవుతామనే భయంతో గ్రామస్తులు దూరంగా ఉన్నారు. ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన కొందరు బంధువులు సైతం ఊరి గొడవలు తమకు ఎక్కడ చుట్టుకుంటాయోనన్న భయంతో పాడె మోసేందుకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్యతో పాటు ఆడపడుచులు, మరో ఇద్దరు పురుషులు పాడె మోసి అంత్యక్రియలు పూర్తిచేయాల్సి వచ్చింది. శవయాత్రలో డెడ్ బాడీపై మురుమురాలు చల్లే బాధ్యత సైతం ఒక చిన్న బాలుడిపై పడిన దృశ్యం మరింత హృదయ విదారకంగా మారింది. ఒక మనిషి చివరి ప్రయాణంలో కూడా కుల బహిష్కరణల గోడలు అడ్డుగా నిలవడం, కనీస మానవత్వం చూపకపోవడంతో సమాజం ఎటు పోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
