హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలంతా భారతీయ జనతా పార్టీని పూర్తిగా నమ్మడం వల్లే అన్ని ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులకు బలమైన ఓటు బ్యాంకు లభించిందన్నారు కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అభ్యర్థి పవన్. శనివారం కూకట్ పల్లిలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ రావు మాట్లాడుతూ.. డివిజన్ ప్రజలంతా బీజేపీకి మద్దతు తెలిపి భారీగా ఓట్లు వేశారన్నారు. స్వల్ప తేడాతో ఓటమి పాలైనప్పటికీ తాను నైతికంగా విజయం సాధించినట్లు స్పష్టం చేశారు.
డివిజన్ పరిధిలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని వారినీ ప్రజలు నమ్మ వద్దన్నారు. క్రమశిక్షణ గల పార్టీగా ప్రజల్లో గుర్తింపు పొందిన బీజేపీనీ ప్రజలు నమ్మాలని తాను కార్పొరేటర్ గా గెలవక పోయినా డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకువస్తే ప్రతిపక్ష హోదాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్.