రామానాయుడు భూముల వ్యవహారంలో సురేష్ ప్రొడక్షన్స్కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

రామానాయుడు భూముల వ్యవహారంలో సురేష్ ప్రొడక్షన్స్కు సుప్రీం కోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో సురేష్ ప్రొడక్షన్స్కి చుక్కెదురైంది. రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో సురేష్ ప్రొడక్షన్స్కు ఊరట దక్కలేదు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. విశాఖలో ఫిల్మ్ సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చని అప్పట్లో జగన్ ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్కు అనుమతి ఇచ్చింది.

రామానాయడు స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని, అందుకే సురేష్ ప్రొడక్షన్స్కు కేటాయించిన భూములను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సురేష్ ప్రొడక్షన్స్ సవాల్ చేసింది.

విచారణ జరిపిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా ధర్మాసనం జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం అడుగుతున్నారని, అది కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే.. ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా పిటిషనర్కు సూచించారు. పిటిషన్ ఉపసంహరించుకుంటామని సురేష్ ప్రొడక్షన్స్ కోరగా, ధర్మాసనం అనుమతించింది.