న్యూఢిల్లీ: సప్లైతోపాటు డిమాండూ పెరగడంతో కిందటి నెలలో వెహికల్స్ బాగా అమ్ముడయ్యాయి. మెజారిటీ ఆటో కంపెనీలు కోలుకున్నాయి. - అంతకుముందు పనితీరు సరిగా లేనివి కూడా, మునుపటి నెలతో పోల్చినప్పుడు అమ్మకాలలో గ్రోత్ని రికార్డు చేశాయి. మారుతీ సుజుకీ వంటి మార్కెట్ లీడర్ల నుండి టాటా మోటార్స్ వంటి వాటి వరకు చాలా కంపెనీలు ఈ ఏడాది మేలో భారీ అమ్మకాలను సాధించాయి. దాదాపు అన్ని ఆటో కంపెనీలు తమ అమ్మకాల్లో ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే మూడు అంకెల గ్రోత్ని నమోదు చేశాయి. అయితే 2021 మేలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. తక్కువ- బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాలు నిరుటితో పోలిస్తే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇవీ లెక్కలు
కోవిడ్ వల్ల 2021 మేలో కేవలం 26,661 యూనిట్లు అమ్ముడయ్యాయని, ఈ ఏడాది మేలో అమ్మకాలు దాదాపు మూడు రెట్లు పెరిగి 76,210 యూనిట్లకు చేరుకున్నాయని టాటా మోటార్స్ తెలిపింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా మే నెలలో మొత్తం 51,263 యూనిట్లను డీలర్లకు పంపింది. ఇది కిందటి ఏడాది మేలో 30,703 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. పోయిన నెలలో ఇండియా మార్కెట్లో 42,293 యూనిట్లను, 2021 మేలో 17,292 యూనిట్లను అమ్మింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు పోయిన ఏడాది మేతో పోలిస్తే ఈసారి మే నెలలో 14 రెట్లు పెరిగి 10,216 యూనిట్లకు చేరుకున్నాయి. పోయిన మే నెలలో ఇది కేవలం 707 బండ్లను మాత్రమే డీలర్లకు అమ్మగలిగింది.
ఎంజీ మోటార్ ఇండియా తన రిటైల్ అమ్మకాలు రెండు రెట్లు పెరిగి మే నెలలో 4,008 యూనిట్లుగా నమోదయ్యాయి. పోయిన ఏడాది ఇదే నెలలో కంపెనీ 1,016 యూనిట్లను అమ్మింది. 2022 ఏప్రిల్ లో 2,008 యూనిట్లను అమ్మింది.టీవీఎస్ మోటార్ కంపెనీ మే నెలలో మొత్తం అమ్మకాలు 3,02,982 యూనిట్లుగా రికార్డయ్యాయి. పోయిన ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 1,66,889 యూనిట్లను అమ్మింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) మే నెలలో హోల్సేల్గా 1,61,413 యూనిట్లను అమ్మింది. 2021 మే లో కంపెనీ 46,555 యూనిట్లను అమ్మింది. పోయిన నెలలో, కంపెనీ దేశీయ అమ్మకాలు 1,34,222 యూనిట్లకు పెరిగాయి. 2021 మే లో 35,293 యూనిట్లను అమ్మింది.
కియా ఇండియా తన అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 69 శాతం పెరిగి 18,718 యూనిట్లకు చేరుకున్నాయి. 2021 మేలో కోవిడ్-–19 నేపథ్యంలో కంపెనీ 11,050 యూనిట్లను డీలర్లకు పంపింది. సోనెట్ 7,899 యూనిట్లతో కంపెనీ మొత్తం అమ్మకాల్లో అత్యధిక వాటాను సాధించింది. కంపెనీ పోయిన నెలలో 15 ఈవీ6 యూనిట్లను డిస్ప్లే కార్లుగా డీలర్షిప్లకు పంపింది.