- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఘటన
ఆర్మూర్, వెలుగు : అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేటలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లాకు చెందిన బూసవెల్లి దుర్గయ్య (36), భార్య మంజులతో కలిసి ఆర్మూర్ మండలం గోవింద్పేట గ్రామంలో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు. మంజులకు అదే గ్రామానికి చెందిన సంజీవ్ అనే వ్యక్తి పరిచయం కాగా.. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దుర్గయ్యకు తెలియడంతో భార్యను నిలదీశాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న దుర్గయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్న మంజుల బుధవారం అర్ధరాత్రి సంజీవ్ను తన ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి దుర్గయ్య గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట పడేశారు. గురువారం ఉదయం ఈ విషయం స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుర్గయ్య సోదరి విజయ ఫిర్యాదుతో మంజుల, సంజీవ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
