హత్యకు సహకరించిన కొడుకు, బంధువులు
నవాబుపేట, వెలుగు: భూమి అమ్ముతానన్నందుకు భర్తను చంపేసి బాత్ రూంలో పాతిపెట్టిందో భార్య. నెల రోజుల తర్వాత విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం మొరంబావి గ్రామానికి చెందిన చెన్నయ్య(45), రాములమ్మ దంపతులు వారికున్న రెండెకరాల్లో ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. నెల రోజులుగా చెన్నయ్య కనిపించకుండా పోవడంతో అతని అక్కలు ఉడిత్యాల వెంకటమ్మ, దొండ్లపల్లి పెంటమ్మ, చెల్లెలు చెన్నమ్మ గ్రామానికి చేరుకుని వదిన రాములమ్మను నిలదీశారు. ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చెన్నమ్మ మంగళవారం సాయంత్రం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాములమ్మను పోలీసులు గట్టిగా విచారించగా భర్తను తానే చంపినట్లు ఒప్పుకుంది. మిగిలిన ఎకరా పొలాన్ని కూడా అమ్ముతానని గొడవ చేస్తుండడంతో కొడుకు రమేశ్, అదే గ్రామానికి చెందిన తన అక్క భర్త పెంటయ్య, చెల్లెలి భర్త రఘుతో కలిసి చెన్నయ్యను చంపేసినట్లు చెప్పింది. కొత్తగా కడుతున్న ఇంట్లోని బాత్రూంలో శవాన్ని పాతిపెట్టామని పేర్కొంది. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు, ఇతర గ్రామాల నుంచి జనాలు పెద్దఎత్తున గ్రామానికి చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు డెడ్బాడీ పాతిపెట్టిన స్థలాన్ని చూపించమని రాములమ్మను అడగ్గా బాత్రూంతో పాటు మరో రెండు జాగాలను చూపిస్తూ ఉండటంతో ఎక్కడ తవ్వాలో అర్థంకాక పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. కేసుకు సంబంధం ఉన్న మిగితా వ్యక్తులను విచారించి గురువారం తహసీల్దార్ సమక్షంలో అనుమానం ఉన్న స్థలంలో తవ్వి డెడ్బాడీ బయటకు తీస్తామని ఎస్సై శ్రీకాంత్ చెప్పారు.