ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే

ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే
  • ప్రభుత్వ పథకాలు పార్టీల ప్రకారం కాదు.. పేదల ప్రకారం ఇవ్వాలి 
  • ఇదే కేసీఆర్ నిజస్వరూపం: మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్: ఎన్నికల ముందు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేతలకు పొంతన లేదని.. ఇదే కేసీఆర్ నిజస్వరూపమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం జరిగిన భీమ్ దీక్షలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అంబేద్కర్ ను అవమాన పరిచాడని.. రాజ్యాంగాన్ని కించపరిచాడని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు.. వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇచ్చిన తీర్పే రేపు తెలంగాణ ప్రజలందరూ ఇవ్వబోతున్నారని, హుజురాబాద్ ఎన్నికల్లో తనలాంటి ఉద్యమ కారుడిని ఉరితీయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖతం పట్టించాలని కుట్రపూరితంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించి.. ఎన్నికల ముందు పది లక్షలు ఎకౌంట్ లో వేసి పాసుపుస్తకాలు ఇచ్చి ఎవరో అడ్డుకున్నారు అని నాటకమాడారని విమర్శించారు. 
రెండో తారీఖు ఎన్నికలు.. నాలుగో తారీఖున కుర్చీ వేసుకుని దళిత బంధు ఇస్తానన్న కేసీఆర్ ఎక్కడ..?
రెండో తారీకు ఎన్నికల అయిపోతే నాలుగో తారీకు నేనే కుర్చీ వేసుకుని దళిత బంధువు ఇస్తానని చెప్పినావు కదా కేసీఆర్....  దళిత బంధు ఎక్కడ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 20 వేల కుటుంబాలు ఉంటే వెయ్యి కుటుంబాలకు ఇచ్చారని ఆరోపించారు. ‘‘లక్షన్నర పెట్టి షెడ్డు వేసుకుంటేనే బర్రెలు ఇస్తామన్నారు..
రెండున్నర లక్షలు పెట్టి బర్లు కొంటె అవి వచ్చేలోపు చచ్చి పోతున్నాయని.. పాస్ బుక్ లో ఉన్న డబ్బులు గాలిమాటలేనన్నారు. ఇచ్చే 10 లక్షల మీద మీ పెత్తనం ఉండవద్దు అని చెప్పాను...వారు ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దళితుల మీద ప్రేమ నిజమే అయితే.. దళితుల బాగుపడాలని సంకల్పం ఉంటే.. వారు ఏం బిజినెస్ చేసుకుంటారో వాటికి అనుమతించండి.. ఇల్లు కట్టుకున్నా,  ట్రాక్టర్, హార్వెస్టర్ కొనుక్కున్నా, షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకున్నా అనుమతించాలి.. కలెక్టర్, బ్యాంకర్ల పెత్తనం ఉందకూడదు.. దళితులకు 10 లక్షలు ఎక్కడ కూడా అందలేదు.. టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారికి మాత్రమే ఇస్తం.. మా పార్టీ కానీ వాళ్లకి ఇవ్వమని వేధిస్తున్నారు..’’ ఆరోపించారు.  
‘ఇది అంబేద్కర్ రాజ్యాంగం.. ప్రభుత్వపరమైన పథకాలు పార్టీల ప్రకారం కాదు,  పేదల ప్రకారం ఇవ్వాలి.  అన్ని కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలి. ఎన్నికల ముందు అనేక కుల సంఘాలకు బంగ్లాలు,  గుళ్లు , మహిళా సంఘాల భవనాలు అని చెప్పి నా ఎక్కడ కూడా పనులు జరగడం లేదు. ఏ గుడి కూడా కట్టడం లేదు. జమ్మికుంటలో 30,40 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకుని ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు..’ అని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

 

ఇవి కూడా చదవండి..

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి