
- షార్ట్సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్
- కాదంటున్న విద్యుత్ శాఖ.. ఎటూ తేల్చని అధికారులు
- కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు .. 48 గంటలు గడిచినా నో క్లారిటీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ వద్ద బిల్డింగ్లో అగ్ని ప్రమాద ఘటన ఎలా జరిగిందన్న దానిపై క్లారిటీ రావడం లేదు. షార్ట్సర్క్యూట్అని ఒక శాఖ చెప్తుండగా, కాదని మరో డిపార్ట్మెంట్తోసిపుచ్చుతున్నది. ఏసీ కంప్రెషర్లపై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉండవచ్చని మరికొందరు చెబుతున్నా.. స్పష్టత రావడం లేదు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ చేసే ఫైర్డిపార్ట్మెంట్, షార్ట్సర్క్యూట్వల్ల ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తే నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పోలీసులు.. ఇలా ఏశాఖ కూడా ప్రమాదం ఎలా జరిగిందో చెప్తూ ఒక ప్రకటన కూడా చేయలేదు. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించి.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక ప్రాథమిక అంచానకు కూడా రాలేకపోయారు.
ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే?
అగ్ని ప్రమాద ఘటన జరిగినప్పుడు ఒక మహిళ కేకలు విన్న నలుగురు యువకులు.. బాధితులను రక్షించేందుకు పైకి వెళ్లారు. ఫస్ట్ఫ్లోర్లో ఒక రూమ్లో కొంతమంది అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. అక్కడ ఏసీ కంప్రెషర్పేలి ఉన్నట్టు గమనించామని చెప్పారు. తర్వాత మూడున్నర గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఫైర్సేఫ్టీ సిబ్బంది, అధికారులను ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని ప్రశ్నించగా.. షార్ట్సర్క్యూట్వల్లే అగ్గి రాజుకుందని, తర్వాత ఏసీ కంప్రెషర్లు పేలడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్జరిగి మంటలు వచ్చాయని, అవి ఇంట్లోకి వ్యాపించి ఆ తాకిడికి ఏసీ కంప్రెషర్లు బ్లాస్ట్ అయ్యాయని తెలిపారు. ఆ ఇంట్లో షార్ట్సర్క్యూట్తో మెయిన్ వద్ద మంటలు వచ్చినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నదని చెప్పారు. దీంతో అందరూ షార్ట్సర్క్యూట్వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనాకు వచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కాదంటున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్
గుల్జార్హౌస్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగాక విద్యుత్ శాఖ అధికారులు ప్రైమరీ ఎంక్వైరీ చేశారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్సర్క్యూట్కాదని తేల్చారు. మీటర్బాగానే ఉందని, పోలీసులు తమకు ప్రమాదం గురించి చెప్పాకే కరెంట్ కట్ చేశామన్నారు. షార్ట్సర్క్యూట్వల్ల మీటర్ కాలిపోయి ఫీడర్ట్రిప్అవుతుందని, కానీ, అలాంటి ఆనవాళ్లే లేవని వెల్లడించారు. కాగా, ఘటనపై విద్యుత్ శాఖ విచారణ జరుపుతున్నదని, ఒకటి రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలిసింది.
దర్యాప్తు కొనసాగుతున్నదన్న పోలీసు శాఖ
ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. 48 గంటలు గడిచినా ఎలాంటి స్పష్టత రాలేదని సమాచారం. మరోవైపు ఫైర్, ఎలక్ట్రిసిటీ అధికారుల ప్రకటనలు వారిని తికమక పెడుతున్నాయి. మీటర్లలోనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని ఫైర్ఆఫీసర్లు చెప్తుంటే.. మీటర్లు సరిగ్గానే ఉన్నాయని ఎలక్ట్రిసిటీ అధికారులు అంటున్నారు. ఆదివారం ప్రమాదం, రెస్క్యూ హడావిడి ఉండగా, సోమవారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చెందిన ఏ అధికారి విచారణ కోసం ఘటనా స్థలానికి రాలేదు. ఇంటర్నల్ఎంక్వైరీ మాత్రం జరుగుతున్నదని పోలీసులు చెప్పారు. అయితే, మరో కోణంలో ఆలోచించి క్లూస్టీం అయినా ఆధారాలు సేకరిస్తుందని భావించినా, అదీ జరగలేదు.