కిలోమీటర్ బేసిస్ లో ఒప్పందం కుదిరిన తర్వాతే మంత్రుల సమావేశం
ఖమ్మం జిల్లా: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం(14.9.2020) నాడు ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం జరగడం లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లో సమావేశం జరుగనున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. కిలో మీటర్ బేసిస్ లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం అదికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయిని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
గత మార్చిలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అన్ లాక్ ప్రారంభమైనా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదరకపోవడంతో ఎవరి రాష్ట్ర పరిధిలో వారు వారు తమ సరిహద్దు చివరి వరకు బస్సులు నడుపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా కిలోమీటర్ బేసిస్ పై ఒప్పందం కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.