ముంబై: రాబోయే వన్డే వరల్డ్ కప్లో తన ప్రాతినిధ్యంపై వస్తున్న ఊహాగానాలపై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అక్టోబర్ 2027 చాలా దూరం ఉందని, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తానని స్పష్టం చేశాడు.
ముంబైలో గురువారం జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘వరల్డ్ కప్కు ఇంకా చాలా టైమ్ ఉంది. పరిస్థితుల్లో మార్పులు రావొచ్చు. భవిష్యత్ ప్రణాళికలపై ఇప్పుడే ఏం చెప్పలేం’ అని రోహిత్ పేర్కొన్నాడు.
టెస్ట్, టీ20లకు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ విజయానంతరం ముంబైలో నిర్వహించిన ఓపెన్ బస్ పరేడ్ మళ్లీ సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నకు రోహిత్ బదులిచ్చాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి బస్ పరేడ్ సాధ్యం కాకపోవచ్చు’ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్ అద్భుత ఫామ్లో ఉన్నాడని గతంలోనే బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కితాబిచ్చాడు.
