- రాణించిన షెఫాలీ, హర్మన్ప్రీత్, దీప్తి శర్మ
దుబాయ్: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న ఇండియా విమెన్స్ జట్టు.. ఆసియా కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్లో షెఫాలీ వర్మ (40 బాల్స్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), బౌలింగ్లో దీప్తి శర్మ (3/26) చెలరేగడంతో.. గురువారం జరిగిన తొలి సెమీస్లో టీమిండియా 40 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 149/6 స్కోరు చేసింది. ఛేజింగ్లో బంగ్లా 20 ఓవర్లలో 109/7 స్కోరుకే పరిమితమైంది. షోర్నా అక్తర్ (22 నాటౌట్) టాప్ స్కోరర్. స్టార్టింగ్ నుంచి ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాటర్లు రన్స్ చేయడంలో ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి, పేసర్ నందని శర్మ (2/10) బౌలింగ్ను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. దిల్హారా అక్తర్ (21), ఫిర్దోస్ (14), శోభనా మోస్త్రే (18), నిగర్ సుల్తానా (19), షర్మిన్ అక్తర్ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో షోర్నా అక్తర్, ఫహిమా ఖాతున్ (14) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. మధ్యలో ప్రతీకా రావల్ రెండు క్యాచ్లు జారవిడిచినా బంగ్లా ప్లేయర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
క్యాచ్లు వదిలేయడంతో..
కఠినమైన పిచ్పై బ్యాటింగ్కు దిగిన ఇండియాను కట్టడి చేయడంలో బంగ్లా బౌలర్లు సక్సెస్ అయ్యారు. కానీ షెఫాలీ వర్మ ఇచ్చిన మూడు క్యాచ్లను మిస్ చేసి మూల్యం చెల్లించుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నాలుగు క్యాచ్ డ్రాప్ చేయడం ఇండియాకు కలిసొచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్మృతి మంధాన (2)ను సుల్తానా ఖాతున్ (2/30) ఔట్ చేసింది. 9/1 స్కోరు వద్ద వచ్చిన ప్రతీకా రావల్ (20) కవర్డ్రైవ్తో ఇన్నింగ్స్ను ఘనంగా ఆరంభించినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. పవర్ప్లేలో ఇండియా 45/1 స్కోరు చేసింది. 10వ ఓవర్లో రబేయా ఖాన్ (1/22) బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ సిక్సర్ కొట్టిన ప్రతీకా ఇదే ఓవర్లో వెనుదిరిగింది.
దాంతో రెండో వికెట్కు 50 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (28 బాల్స్లో 24 నాటౌట్) కూడా బ్యాటింగ్లో ఇబ్బందిపడింది. తన తొలి 16 బాల్స్లో కేవలం 4 రన్స్ మాత్రమే చేసింది. రెండో ఎండ్లో 6, 11, 56 రన్స్ వద్ద్ క్యాచ్లు వదిలేయడం షెఫాలీకి కలిసొచ్చింది. జట్టులో టాప్–4 బ్యాటర్లు వంద కంటే తక్కువ స్ట్రయిక్ రేట్తో ఆడినా షెఫాలీ 160 స్ట్రయిక్ రేట్తో రన్స్ రాబట్టింది. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో మూడు సిక్సర్లతో జోష్ పెంచింది. ఈ క్రమంలో 35 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. అయితే పవర్ప్లేతో పోలిస్తే మిడిల్ ఓవర్లలో ఇండియా రన్స్ చేయడంలో ఇబ్బందిపడింది. 14వ ఓవర్లో షెఫాలీ ఔట్ కావడంతో మూడో వికెట్కు 31 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 15.1 ఓవర్లలో ఇండియా స్కోరు వందకు చేరింది. చివర్లో రిచా ఘోష్ (21), దీప్తి శర్మ (13) బ్యాట్లు ఝుళిపించడంతో ఆమాత్రం స్కోరైనా వచ్చింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 149/6 (షెఫాలీ 64, హర్మన్ప్రీత్ 24*, సుల్తానా ఖాతున్ 2/30), బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 109/7 (షోర్నా అక్తర్ 22*, దీప్తి 3/26).
