జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం : తాడిపత్రిలో ఉద్రిక్తత

జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహనిర్బంధం : తాడిపత్రిలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో ఇసుక, మట్టి అక్రమంగా తవ్వి.. తరలిస్తున్నారని కొంతకాలంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం (ఏప్రిల్ 24) నుంచి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుంటామని, వాటిని తరలించే వాహనాలను తగులబెడతామని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులు మోహరించారు. 

జేపీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన కొంతమంది తెలుగుదేశం నేతలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం జేసీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. బయటకు వచ్చిన ఆయన్ను పోలీసులు తిరిగి ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జేసీ నేలపై పడిపోయారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ తన ఇంటి ముందే కుర్చీలో కూర్చొని నిరసన తెలిపారు. దీంతో కుర్చీతో సహా జేసీని బలవంతంగా తిరిగి లోపలికి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించారు. పోలీసుల చర్యలను టీడీపీ  నేతలు తీవ్రంగా ఖండించారు. పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నాకు జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనల వల్లే జేసీని అడ్డుకున్నామని పోలీసులు చెప్పారు.