బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే.. కుట్రదారుడిగా ఎఫ్​ఐఆర్

బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే.. కుట్రదారుడిగా ఎఫ్​ఐఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. టెన్త్ పరీక్ష పేపర్లు తెలుగు, హిందీ లీకులకు కుట్ర చేశారనే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఒక కేసు కరీంనగర్ 2 టౌన్ లో.. మరో కేసును వరంగల్ కమలాపూర్ లో నమోదు చేశారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఈ మేరకు ధృవీకరించారు వరంగల్ సీపీ రంగనాథ్. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశామని.. అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ఎఫ్​ ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారాయన. 

పేపర్ లీకేజీలో, ప్రచారం వెనక ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందని.. కుట్రదారుడిగా పేర్కొంటూ.. అతనిపై 420, 120(బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.  సీఆర్‌పీసీ 154, 157  సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు.

బండి సంజయ్ FIRలోని కీలక అంశాలను చూస్తే.. ఎంపీ బండి సంజయ్ చర్యల వల్ల మొత్తం పరీక్ష నిర్వహణలు ఇబ్బందులుగా మారుతున్నాయని.. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని.. విద్యార్థుల పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ ని ప్రివెన్షన్ అరెస్ట్ చేశాం అని పోలీసులు తమ ఎఫ్ ఐఆర్ కాపీలో స్పష్టం చేశారు.

అదే విధంగా వికారాబాద్, కమలాపూర్ లో పేపర్ లీకేజీలపై బండి సంజయ్ నోట్స్ ఇచ్చారని.. అంతేకాకుండా పేపర్ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత అంటూ ప్రకటించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.

విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని.. పరీక్ష కేంద్రాల దగ్గర ధర్నాలు చేయాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారని ఎఫ్ఐఆర్ లో రాశారు పోలీసులు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారని.. దీని వల్ల పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారుతుందంటూ బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి.