
హైదరాబాద్: గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని హైటెక్స్లో వేదికగా జరుగుతోన్న ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజ్, ఎఫ్డీసీ ఎండీ హరీశ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
హీరోలు అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, నిర్మాతలు దిల్ రాజ్, అల్లు అరవింద్, సీనియర్ హీరోయిన్స్ సుహాసినీ, జయసుధ, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, సుకుమార్, మురళీ మోహన్, కీరవాణి, సింగర్ రేవంత్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుక ప్రారంభమైన కొద్ది సేపటికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో అల్లు అర్జున్ హాగ్ చేసుకోవడం ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తమన్ మ్యూజిక్ షో, స్పెషల్ డాన్స్లు ఆకట్టుకున్నాయి. 2014 నుంచి 2024 వరకు మొత్తం 30 సినిమాలకు ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది. 2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటులు, దర్శకులు, టెక్నిషియన్లకు ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేసింది.