మా ఆఫీస్ వాళ్ల ఫోన్లనూ ట్యాప్ చేసిన్రు.. ఫోన్ ట్యాపింగ్ చాలా భయంకరమైంది: కిషన్రెడ్డి

మా ఆఫీస్ వాళ్ల  ఫోన్లనూ ట్యాప్ చేసిన్రు.. ఫోన్ ట్యాపింగ్  చాలా భయంకరమైంది: కిషన్రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలాడుతున్నయ్​
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరిన 
  • రేవంత్​ రెడ్డి.. ఇప్పుడు సైలెంట్​ అయిపోయారు
  • బీజేపీని అడ్డుకునేందుకు  ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నయ్​
  • బీజేపీతోనే తెలంగాణకు రక్షణ అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో తమ కార్యాలయ సిబ్బంది, నాయకులు, సోషల్ మీడియా టీమ్‌‌‌‌‌‌‌‌ ఫోన్లనూ ట్యాప్ చేశారని ఆరోపించారు. జడ్జిలు, బిజినెస్​మెన్లు, సినీ నటులు, ప్రతిపక్ష నాయకులు, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఫోన్లను వదల్లేదని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్​ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ నిర్వహించారు. 

దీనికి బీజేపీ రాష్ట్ర ఇన్​చార్జి సునీల్ బన్సల్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ఇది కాంగ్రెస్, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న నాటకమని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బీజేపీని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.  ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్​ సర్కారు వివిధ అంశాలను తెరపైకి తెస్తున్నదని అన్నారు. 

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలు, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చడంలో విఫలమైన విషయాలను ప్రజలకు వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పులపాలై, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరిందని, ఇది గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమే అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని, మోదీ నాయకత్వంలోనే తెలంగాణకు రక్షణ అని పేర్కొన్నారు.

కొత్త నాయకత్వం రావాలి..

గ్రామీణ ప్రాంతాల్లో యువత, బడుగు బలహీన వర్గాల నుంచి కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని కిషన్​రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండలాలవారీగా, జిల్లాలవారీగా బీజేపీ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లు, శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జూన్ 25న ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సందర్భంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు డీకే అరుణ, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, తదితరులు 
పాల్గొన్నారు.