ఈ ప్రభుత్వానికి బుద్ది..సిగ్గు లేదు !

ఈ ప్రభుత్వానికి బుద్ది..సిగ్గు లేదు !

పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క 

ముదిగొండ, వెలుగు : టీఆర్ఎస్​ ప్రభుత్వం బుద్ది, సిగ్గు లేకుండా పరిపాలిస్తున్నదని సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని యడవల్లి నుంచి పీపుల్స్ మార్చ్ పేరుతో ఆదివారం పాదయాత్ర ప్రారంభించారు. ఇది  నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను కవర్​ చేస్తూ 32 రోజుల పాటు సాగనుంది. 506  కిలోమీటర్లు కొనసాగనున్న యాత్రలో భాగంగా మొదటి రోజు యడవల్లిలోని యోగానంద లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్​లో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. యడవల్లి నుంచి మాదాపురం, కట్టకూరు, మేడేపల్లి, యడవల్లి లక్ష్మీపురంలతో కలిపి సుమారు 17 కిలోమీటర్లు యాత్ర చేసి రాత్రి ముదిగొండలో బస చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక రాష్ట్ర సంపద అంతా కేసీఆర్ కుటుంబంతో పాటు, వారి మంత్రుల దోపిడీకి గురైందే తప్ప ప్రజలకు చేరలేదన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఐకేపీ పనులకు కొబ్బరికాయలు కొట్టి తామే ఉపాధి కల్పిస్తున్నామంటూ ఫొటోలకు పోజులిస్తున్నారన్నారు. మాటల్లోనే తప్ప చేతల్లో ఎక్కడా బంగారు తెలంగాణ కనిపించడం లేదన్నారు. నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రమంతా పీపుల్స్ మార్చ్ చేస్తానని, ప్రజలతో కలిసి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామన్నారు. కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా లీడర్లు రాయల నాగేశ్వరరావు, మహ్మద్ జావీద్, మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేశ్​బాబు , స్థానిక నాయకులు పాల్గొన్నారు.