- రూ. 2.7 లక్షల కోట్లతో ప్రవేశపెట్టనున్న సర్కార్
- గవర్నర్ స్పీచ్ లేకండానే ఈ ఏడాది తొలి సమావేశాలు
- ఇయ్యాల బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
- దళితబంధుకు భారీగా కేటాయింపులు!
- ‘ముందస్తు’కు ఉపయోగపడేలా పద్దు!
- ఈ ప్రభుత్వంలో ఇదే చివరి ఫుల్ బడ్జెట్.. వచ్చే యేడు ‘ఓటాన్ అకౌంట్ ’
హైదరాబాద్, వెలుగు: 2022 – 23 వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టనుంది. ఆదివారం సాయంత్రం కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెడుతారని పేర్కొన్నాయి. కాగా, గవర్నర్ స్పీచ్ లేకుండానే ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిరుడు నిర్వహించిన అసెంబ్లీ ఎనిమిదో, కౌన్సిల్ 18వ సెషన్కు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది.
ఇయ్యాల కేబినెట్ భేటీ
రాష్ట్ర కేబినెట్ ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానుంది. 2022 – 23 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే కూటమిపైనా సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. ముంబై, ఢిల్లీ, రాంచీ పర్యటనల సందర్భంగా తాను ఈ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరిపిన చర్చలు, ఇతర అంశాలపై మంత్రుల నుంచి సీఎం ఫీడ్ బ్యాక్ తీసుకునే అవకాశముంది. మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం ఘటన కూడా ప్రస్తావనకు వచ్చే చాన్స్ ఉంది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రశాంత్ కిశోర్తో కలిసి టీఆర్ఎస్ పనిచేయడం సహా అనేక అంశాలపై కేబినెట్లో చర్చించే ఆస్కారముంది.
దళిత బంధుకు భారీగా..
రానున్న ఆర్థిక సంవత్సరంలో దళితబంధుకు కేటాయింపులు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కీం అమలవుతున్నా.. ఎస్సీ కుటుంబాల సంఖ్యకు తగినంతగా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. దీంతో ఈసారి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల దాకా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత రైతుబంధుకు రూ.14 వేల కోట్లు, ఆసరాకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించే హామీకి ఈసారి నిధులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇరిగేషన్కు ఇచ్చే నిధులు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పుల ద్వారా సమకూర్చుకోనున్నారు. రైతు రుణమాఫీ, ఇండ్లు కట్టుకునేందుకు అర్హులకు డబ్బులు ఇవ్వడం, కల్యాణలక్ష్మి వంటి వాటికి కూడా ఫండ్స్ ఎక్కువగానే ప్రతిపాదించినట్లు తెలిసింది.
కరోనా తగ్గినా మాస్క్ మస్ట్..
రాష్ట్రంలో కరోనా తగ్గినా అసెంబ్లీ సమావేశాల్లో కరోనా రూల్స్ మస్ట్గా పాటించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సమావేశాలకు హాజరయ్యే సభ్యులతోపాటు అధికారులు, సిబ్బంది మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలో కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకొని నెగెటివ్ వస్తేనే అసెంబ్లీకి రావాలన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం, కౌన్సిల్ ప్రొటెం చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో రివ్యూ చేశారు. పోచారం మాట్లాడుతూ.. సమావేశాలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన ప్రశ్నలు, సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. గత సమావేశాల్లో పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు వెంటనే జవాబులు పంపించాలన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సభ ప్రశాంతంగా జరగాలంటే బయట పరిసరాలు కూడా ప్రశాంతంగా ఉండాలని, ఇందుకు పోలీసులు సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అసెంబ్లీ సెక్రటరీ వి.నర్సింహాచార్యులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ సీఎస్లు రామకృష్ణారావు, అర్వింద్కుమార్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, డీహెచ్ రమేశ్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హోం సెక్రటరీ రవిగుప్త, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్, డీజీ శివకుమార్, చీఫ్ మార్షల్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరుటి కంటే ఎక్కువ..
గత ఏడాది రూ.2.32 లక్షల కోట్లతో పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.7 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. రాష్ట్ర సొంత రాబడి ఈసారి భారీగా పెరుగుతుందని సర్కారు అంచనా వేసింది. మరోవైపు జీఎస్డీపీ వృద్ధి రేటు పెరిగింది. దీంతో బడ్జెట్భారీగానే ఉండే అవకాశముంది. వచ్చే ఏడాది కేంద్రం నుంచి దాదాపు రూ.36 వేల కోట్లు రానున్నాయి. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాతో పాటు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, జీఎస్టీ పరిహారం, హెల్త్, అగ్రికల్చర్ గ్రాంట్లు ఇందులో ఉన్నాయి. వచ్చే ఏడాదికి తెలంగాణ జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా అంచనాలు ఉన్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిమితి ప్రకారం అందులో 3.5 శాతం అప్పు తీసుకునే అవకాశముంటుంది. వీటికి తోడు రాష్ట్ర ఆదాయం రూ.1.9 లక్షల కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం, లిక్కర్ రేట్లతో ఆదాయం పెరగడం, భూముల అమ్మకంతో నాన్ టాక్స్ ఆదాయం ఎక్కువ వస్తుందని భావిస్తోంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.15,000 కోట్లు, లిక్కర్తో రూ.20 వేల కోట్ల దాకా రాబడిని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరోనా పరిస్థితులు ఏమీ లేకుంటే జీఎస్టీ వసూళ్లతోపాటు ఇతర ఆదాయాలు మస్తుగా వస్తాయని భావిస్తోంది. రాష్ట్ర రెవెన్యూ రాబడితో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులు, ద్రవ్యలోటు కలిపితే.. బడ్జెట్ రూ.2.7 లక్షల కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి.
‘ముందస్తు’కు ఉపయోగపడేలా!
టీఆర్ఎస్ ప్రభుత్వం సెకండ్ టర్మ్లో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే కానుంది. ఈసారి కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రభుత్వంలోని ముఖ్యులే లీకులు ఇస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీని రద్దు చేసే ఆస్కారముందని ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది డిసెంబర్తో ముగియనుంది. వచ్చే ఏడాది మార్చికి ముందే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ బడ్జెట్ను ఓట్లు కురిపించే అస్త్రంగా సీఎం కేసీఆర్ ఉపయోగించుకునే ఆస్కారముంది. ఆయన ఇప్పటికే ప్రకటించిన అనేక పథకాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశముంది.