హైదరాబాద్: కేటీఆర్ సీఎం కావడం ఖాయమని, ఆయన సీఎం కావడానికి ఇదే సరైన సమయమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(EWS)కు ప్రభుత్వం 10% రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా శనివారం తన నియోజక వర్గం లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కేటీఆర్ను సీఎం చేస్తే టీఆర్ఎస్ లో అణు బాంబు పేలడం పక్కా అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… కేటీఆర్ సీఎం అయ్యాక బాంబు ఎక్కడ పేలుతుందో బండి సంజయ్ కి తెలుస్తుందని దానం విమర్శించారు.
తమకు ప్రధాని అయినా.. ముఖ్యమంత్రి అయినా కేసీఆరే అని.. ప్రధానితో మాకేం పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బాస్ దగ్గరకు మా బాస్ రావాల్సిన అవసరం లేదని, మీ పార్టీ(బీజేపీ) కి బాంబులు, హత్యలు తప్ప ఏమీ గుర్తుకు రావని దానం నాగేందర్ అన్నారు.