రుచి మరిగిన దొంగ.. కిరాణా షాపు ఓనర్ను గన్తో బెదిరించి రూ.5 లక్షలు దోపిడీ.. ఇది మూడోసారి..

రుచి మరిగిన దొంగ.. కిరాణా షాపు ఓనర్ను గన్తో బెదిరించి రూ.5 లక్షలు దోపిడీ.. ఇది మూడోసారి..

జీడిమెట్ల, వెలుగు: తుపాకీతో బెదిరించి దొంగలు ఓ దుకాణం యజమాని వద్ద రూ.5 లక్షలు దోచుకెళ్లారు. పేట్​బషీరాబాద్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లి ఏఆర్​కాంప్లెక్స్​లో నివాసముండే సాయిబాబా(50) కొంపల్లి మున్సిపాలిటీకి వెళ్లే ప్రధాన రహదారిలో ఇరవై ఏళ్లుగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. 

హోల్​సేల్​గా సిగరెట్లు సైతం విక్రయిస్తుంటాడు. బుధవారం (జూన్ 11) రాత్రి 10.30 గంటలకు దుకాణం మూసివేసే సమయంలో ఇద్దరు యవకులు మాస్కులు, హెల్మెట్​ ధరించి దుకాణానికి వచ్చారు. అప్పటికే సాయిబాబా ఇంటికి తీసుకెళ్లడానికి బ్యాగులో రూ.5 లక్షలు పెట్టుకున్నాడు. వచ్చిరాగానే యువకులు బ్యాగును లాక్కునే ప్రయత్నం చేయగా సాయిబాబా తోపులాటలో కిందపడ్డాడు. 

పక్కనే ఉన్న మరో దుకాణం యజమాని వచ్చి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దొంగలు వారి వెంట తెచ్చుకున్న తుపాకీతో బెదిరించి రూ.5లక్షలు ఉన్న బ్యాగును లాక్కుని పారిపోయారు. దీంతో బాధితుడు పేట్​బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

ఇది మూడోసారి....

సాయిబాబకు చెందిన ఈ దుకాణంలో దొంగతనం జరగడం ఇది మూడోసారి. 2020లో దొంగలు రూ.లక్షా 50 వేల విలువైన సిగరెట్లను, 2024లో రూ.10 లక్షల విలువైన సిగరెట్లను ఎత్తుకెళ్లారు. తాజాగా బుధవారం రాత్రి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.