ఆ రైలులో ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఫోన్: తెలంగాణ పోలీసులు హై అలర్ట్

ఆ రైలులో ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఫోన్: తెలంగాణ పోలీసులు హై అలర్ట్

హైదరాబాద్: ఔరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్ ‎నుమా ఎక్స్‎ప్రెస్ రైలుకు బెదిరింపు కాల్ కలకలం రేపింది. ట్రైన్‎లో ఉగ్రవాదులు ఉన్నారంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, రైల్వే పోలీసులు ఘట్ కేసర్ రైల్వేస్టేషన్‎లో  రైలును ఆపి తనిఖీలు చేపట్టారు. ఘట్‎కేసర్ లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు దాదాపు గంట నుంచి రైలును జల్లెడ పడుతున్నారు. 

అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. ట్రైన్‎లో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం తెలియడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు గంట నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ట్రైన్‎లో తనిఖీలు చేస్తూనే.. మరోవైపు కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దసరా పండగ వేళ రైళ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్నారని కాల్ రావడంతో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.