ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెందోర్ సంతోష్ కుమార్ అలియాస్ సాధన తనకు కొందరు రాజకీయ నేతలు, వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. ట్రాన్స్ జెండర్ సాధన తొలి విడత ఎన్నికల్లో మార్లవాయి పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేశారు. సోమవారం ఎస్పీ, కలెక్టర్ను కలిసేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడారు.
కొందరు రాజకీయ నేతలు, వ్యక్తులు తనను గ్రామానికి రావొద్దని, ప్రచారం చేయవద్దని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన వద్ద కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్పారు. ట్రాన్స్ జెండర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు చిన్నచూపు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఫిర్యాదును స్వీకరించకుండా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

