- తాళ్లపేట రేంజ్లో ఉచ్చులు పెట్టి చంపిన వేటగాళ్లు
- ముగ్గురు నిందితులు అరెస్ట్, 13 గోర్లు స్వాధీనం
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్లోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట రేంజ్ ఊట్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులిని బైక్ క్లచ్ వైర్లతో ఉచ్చు బిగించి హత్య చేశారు. జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి చిరుతపులిని చంపేశారు. పక్కా సమాచారంతో ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు చేపట్టి దండేపల్లి మండలం ఊట్ల గ్రామానికి చెందిన మొడ్తే వెంకటేశ్, మొడ్తే శ్రీనివాస్, పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన వనపర్తి శ్రీకాంత్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 చిరుత గోర్లు, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. చిరుతపులి కళేబరాన్ని కాల్చి వేసినట్లు దర్యాప్తులో తేలిందని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఎఫ్డీవో తెలిపారు. చిరుతను చంపిన కేసులో మరికొంత మంది ఉన్నట్లు సమాచారం.
