విజయ్ సేతుపతి, ప్రియదర్శి సరసన.. అంతర్జాతీయ అవార్డ్ దక్కించుకున్న మట్టి కథ హీరో

విజయ్ సేతుపతి, ప్రియదర్శి సరసన.. అంతర్జాతీయ అవార్డ్ దక్కించుకున్న మట్టి కథ హీరో

మట్టి కథ.. ఇంకా రిలీజ్ కాకుండానే అంతర్జాతీయ అవార్డుల్లో తన సత్తా చాటుతోంది. ఈ సినిమాలో హీరోగా నటించిన అజయ్ వేద్.. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎంపిక కావటం విశేషం. గతంలో ఇదే అవార్డు కింద తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బలగం హీరో ప్రియదర్శి కూడా ఎంపికయ్యారు. ఇప్పుడు వీళ్లద్దరి సరసన చేరారు మట్టి కథ హీరో అజయ్ వేద్. నటించిన మొదటి సినిమాలోనే ఉత్తమ నటన ప్రదర్శించి.. అంతర్జాతీయ అవార్డు కైవసం చేసుకోవటంపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అభినందనలు వ్యక్తం చేస్తోంది. 

తెలంగాణ పల్లెలోని యువకుడి కథను.. పల్లె వాతావరణంలో తెరకెక్కించిన సినిమా మట్టి కథ. మనుషులకు మట్టితో ఉండే అనుబంధాన్ని.. మట్టి విలువను కథాంశంగా తీసిన మట్టి కథ సినిమాకు ఇప్పుడు అంతర్జాతీయంగా అవార్డుల పంట పండిస్తుంది. ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఇండియన్ ఫ్యూచర్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీల్లో విజేతగా నిలిచింది. అదే విధంగా డెబ్యూట్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఫ్యూచర్ ఫిల్మ్ కింద ఎంపిక అయ్యింది మట్టి కథ. 

ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డ్స్ రాకతో.. మట్టి కథ సినిమాపై అటెన్షన్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇదే ఇండో ఫ్రెండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇటీవల బలగం సినిమాకు అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్డర్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో నటుడు ప్రియదర్శి ఎంపికయ్యాడు. ఇప్పుడు అదే కేటగిరీలో మట్టి కథ సినిమా హీరో అజయ్ వేద్.. ఉత్తమ నటుడిగా ఎంపిక కావటం మూవీపై అంచనాలను పెంచేసింది. అంతే కాదు.. ఇదే ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో.. మమ్మనీతమ్ అనే తమిళ సినిమాకు హీరో విజయ్ సేతుపతి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సినిమాల సరసన ఇప్పుడు మట్టి కథ చేరింది. 

పవన్ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో.. అజేయ్ వేద్ హీరోగా నటించగా.. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాతగా, సహ నిర్మాతగా సతీశ్ మంజీర వ్యవహరించారు. ప్రముఖ జానపద గాయని కనకవ్వ, బలగం తాత సుధాకర్ రెడ్డి, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. క్రియేటివ్ హెడ్ గా జి.హేమ సుందర్ అయితే.. సంగీతం స్మరన్ సాయి అందించారు. 

ఇటీవల ఈ సినిమా ట్రైలర్, ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు. పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు ఇంటికి వెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయి.. మట్టిలోని మధురానుభూతి ఎలా ఉంటుంది అనేది కళ్లకు కట్టిన సినిమా మట్టి కథ అన్నారాయన. ఆయన అన్నట్లుగానే.. ఇప్పుడు ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా మూడు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకోవటం విశేషం.