ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ లక్షలమంది ప్రాణాలను బలిగొంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎందరినో చంపేస్తోంది. అదే సంఖ్యలో జనాన్ని చావు అంచులదాకా తీసుకెళ్లింది. అటువంటి మహమ్మారి బారినపడిన మూడు నెలల చిన్నారి.. ఎట్టకేలకు దాన్ని జయించాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో మూడు నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడటంతో ఏప్రిల్ 12న తల్లిదండ్రులు బీఆర్డీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. బాలుడికి మరియు అతని తల్లికి కరోనా పరీక్షలు చేశారు. అందులో తల్లికి నెగిటివ్ రాగా.. బాలుడికి మాత్రం పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ బాలుడికి చికిత్స చేయడం క్లిష్టంగా మారింది. పాలు తాగే వయసులో ఉన్న చిన్నారికి ఎలా చికిత్స చేయాలో వైద్యులకు అంతుచిక్కలేదు. దాంతో చిన్నారికి తల్లి పాలు మాత్రమే పడుతూ ఆస్పత్రిలోనే ఉంచారు. ఎటువంటి చికిత్సా చేయలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 25న బాలుడికి, తల్లికి కరోనా పరీక్ష చేయగా ఇద్దరికీ నెగిటివ్ వచ్చింది. అయినాసరే మరుసటిరోజు ఏప్రిల్ 26న మరోసారి పరీక్ష చేసి చూస్తే మళ్లీ నెగిటివ్ వచ్చింది. దాంతో చిన్నారి ఎటువంటి చికిత్స లేకుండానే.. కేవలం తల్లి పాలతోనే రోగనిరోధక శక్తి పెంచుకొని కరోనాను జయించినట్లు బీఆర్డీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గణేష్ తెలిపారు. తల్లిబిడ్డకు కరోనా నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశామని ఆయన తెలిపారు.
గోరఖ్ పూర్ జిల్లా మేజిస్ట్రేట్ విజయేంద్ర పాండియన్, కమిషనర్ జయంత్ నార్లిర్కర్ కరోనావైరస్ ను జయించినందుకు తల్లిబిడ్డను అభినందించారు.