టీమిండియా ఓటమికి మూడు కారణాలు

టీమిండియా ఓటమికి మూడు కారణాలు

మహాభారతంలో కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు..ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి. అయితే చివరి వన్డేలో భారత్ ఓడిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. 

చివర్లో బౌలర్ల వైఫల్యం..

చెన్నై వన్డేలో ఆరంభంలో మన బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు పరుగులు చేయకుండా చక్కగా అడ్డుకున్నారు. భారత బౌలర్ల విజృంభణతో  ఆస్ట్రేలియా ఓ దశలో 203 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ మహా అంటే మరో 20 లేదా 30 పరుగులు చేస్తుంది అనుకున్నారంతా. కానీ తీరా 49 ఓవర్లలో ఆస్ట్రేలియా 269 పరుగులు చేసింది. దీనికి కారణం డెత్ ఓవర్లలో మన బౌలర్లు విఫలం కావడమే. ఆసీస్ టెయిలెండర్స్ ఏకంగా 49 పరుగులు చేయడం గమనార్హం. ఈ పరుగులే ఆసీస్కు విజయాన్ని కట్టబెట్టాయి.  ఆస్ట్రేలియాను 220 లేదా 230 లోపే కట్టడి చేసి ఉంటే భారత్ ఖచ్చితంగా విజయం సాధించి ఉండేది. ఈ నేపథ్యంలో డెత్ ఓవర్లలో భారత్ బలహీనత మరోసారి బయటపడింది. 

కీలక మ్యాచులో చెత్త  ప్రయోగాలు..

డుఆర్ డై మ్యాచ్ అంటే ఎంత ప్లాన్ ఉండాలి. ఎంత జాగ్రత్తగా బ్యాటింగ్ ఆర్డర్ను సెట్ చేయాలి. కానీ ఈ మ్యాచులో టీమిండియా మేనేజ్మెంట్ చెత్త ప్రయోగాలకు పూనుకుని మూల్యం చెల్లించుకుంది. అక్షర్ పటేల్ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించినా ఫలితం దక్కలేదు. అతను కేవలం 2 పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. అటు సూర్యకుమార్ను ఏడో స్థానంలో బ్యాటింగ్కు పంపడం మరో తప్పిదం. సాధారణంగా అయితే వన్ డౌన్ లేదా సెకండ్ డౌన్లో వచ్చే అతన్ని ఏడో స్థానంలో పంపడంతో మరోసారి డకౌట్గా వెనుదిరిగాడు. 

చెత్త షాట్లు..నిర్లక్ష్యపు బ్యాటింగ్

ఈ మ్యాచ్లో ఓటమికి ఖచ్చితంగా బ్యాట్స్మన్ వైఫల్యమే కారణం. చెన్నై పిచ్పై ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆడినట్లు మనోళ్లు ఆడలేకపోయారు. గెలిచే మ్యాచ్లో భారత్ ఓటమిపాలవడానికి కారణంగా నిర్లక్ష్యపు షాట్లే. జంపా బౌలింగ్లో కేఎల్ రాహుల్ నిర్లక్ష్యపు షాట్ ఆడి పెవీలియన్ చేరాడు. కోహ్లీ కూడా అగర్ బౌలింగ్లోనే చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పుల్ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. పాండ్యా, జడేజా కూడా అనవసర షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు. 

రానుంది వన్డే వరల్డ్ కప్..

మొన్నటి వరకు న్యూజిలాండ్, శ్రీలంకపై వన్డే సిరీస్లు గెలవడంతో ఆహ..ఓహో అన్నాం. టీమిండియాకు తిరుగులేదని భావించాం. కానీ ఒక్క సిరీస్ టీమిండియాలోని లోపాలను బయటపెట్టింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో సమస్యలేంటో తెలిసొచ్చింది. ఈ క్రమంలో  ఈ ఏడాది చివర్లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అప్పటిలోగా భారత జట్టు తన లోపాలను సరిదిద్దుకోవాలి. ఆటగాళ్లు బాధ్యతగా ఆడుతూ జట్టును గెలిపించేందుకు వంద శాతం కృషి చేయాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. 

చేజేతులా ఓటమి..

బుధవారం జరిగిన చివరి వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో ఆస్ట్రేలియా దక్కించుకుంది.  ఈ సిరీస్ ఓటమితో టీమిండియా నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో వన్డే సిరీస్  కోల్పోయింది.