
హైదరాబాద్, వెలుగు: పంటలకు గిట్టుబాటు ధర అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వచ్చే జూన్లో ఇంటర్నేషనల్ కమొడిటీ ఆధ్వర్యంలో ‘గ్లోబల్ రైస్ సమ్మిట్ -2024’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆదివారం హైదరాబాద్లోని ఓ హోట్ల్లో మంత్రి తుమ్మల విడుదల చేసి, మాట్లాడారు.
వరి ఎగుమతులపై నిషేధం విధిస్తే ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత్ రైస్ పథకంలో పంపిణీ చేసే బియ్యం.. ఆ రాష్ట్ర అవసరాలకు తగినట్లు లేకపోతే ఈ పథకం సక్సెస్ అవ్వదన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర నిర్ణయించేందుకు మరింత మెరుగైన విధానాలు రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
పంటల సాగులో వైవిధ్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పంటల మార్పిడి రైతులకు అధిక ఆదాయం తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్లో నిర్వహించే గ్లోబల్ రైస్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా వరి పండించే దేశాల ప్రతినిధులు పాల్గొంటారని ఇంటర్నేషనల్ కమొడిటీ ఇన్స్టిట్యూషన్స్ భారత సలహాదారు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో పండించే వరి రకాలను ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రం నుంచి వరి ఎగుమతులను ప్రోత్సహించి రైతులకు లబ్ధి చేకూర్చడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సదస్సులో కేంద్ర పరిశోధన సంస్థలను భాగస్వామ్యం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీ, అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.