రెంట్ విషయంలో ఓనర్తో గొడవ.. నిప్పంటించుకొని టిఫిన్ సెంటర్ యజమాని ఆత్మహత్య

 రెంట్ విషయంలో ఓనర్తో గొడవ.. నిప్పంటించుకొని టిఫిన్ సెంటర్ యజమాని ఆత్మహత్య

మాదాపూర్, వెలుగు: రెంట్ విషయంలో ఓనర్​తో గొడవ పడిన ఓ టిఫిన్ సెంటర్​యజమాని మనస్తాపానికి గురై, కిరోసిన్​పోసుకొని నిప్పంటించుకున్నాడు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాదాపూర్​పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్​అయ్యప్ప సొసైటీ100 ఫీట్​ రోడ్డులో సుధారాణికి చెందిన బిల్డింగ్​లోని షట్టర్​ను అయ్యప్ప సొసైటీ సైబర్​రెసిడెన్సీలో నివాసం ఉంటున్న ఆదినారాయణ(52) 2021 అద్దెకు తీసుకున్నాడు. 

అందులో లక్ష్మీ తులసి పేరిట టిఫిన్ సెంటర్​ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నరగా అద్దె చెల్లించడం లేదు. 6 నెలలుగా రెంట్​ఇవ్వండి లేదా టిఫిన్ సెంటర్ ఖాళీ చేయండంటూ యజమాని ఒత్తిడి తెస్తోంది. అయినా అద్దె చెల్లించకపోవడం, షాప్​ ఖాళీ చేయకపోవడంతో ఈ నెల  16న ఆదినారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 

18న తాము షాప్​ఖాళీ చేయబోమని ఆదినారాయణ కుమారుడు భాను సివిల్​ కోర్టులో కేసు వేసి, ఆర్డర్​ తెచ్చుకున్నాడు. దీంతో బిల్డింగ్​యజమాని అనుచరులు ఈ నెల 27న సాయంత్రం 5.30 గంటలకు టిఫిన్​సెంటర్​వద్దకు చేరుకొని, కుర్చీలను ధ్వంసం చేశారు. క్యాష్​ కౌంటర్​లోని డబ్బులు తీసుకొని, అడ్డువచ్చిన ఆదినారాయణ కుమారుడు, పనివారిపై చేయి చేసుకున్నారు. 

దీంతో మనస్తాపానికి గురైన ఆయన అక్కడే ఉన్న కిరోసిన్​ను ఒంటిమీద పోసుకొని, నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పివేసి, బాధితుడిని మాదాపూర్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. 

సుధారాణి అనుచరులు వచ్చి, తమ టిఫిన్​ సెంటర్​లోని వస్తువులను ధ్వంసం చేసి, తమ వారిని కొట్టారని మృతుడి భార్య తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బిల్డింగ్ యజమాని సుధారాణి, గంగారం యాదవ్​తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.