కొమురం భీం ఆసిఫాబాద్జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామానికి సమీపంలో పెద్దపులి కదలికలతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళితే..
కొమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం మేడిపల్లిలో శివారు అటవీ ప్రాంతంలో శనివారం( ఆగస్టు 29) మేతకు వెళ్లిన పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో మేడిపల్లి గ్రామానికి చెందిన మర్సకోల తెలంగాణరావు కు చెందిన ఎద్దు మృతిచెందింది.
మేతకు అడవికి వెళ్లి తిరిగి రాకపోవడంతో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీప్రాంతంలో అధికారులు గాలించగా ఎద్దు మృతదేహం కనిపించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పెద్ద పులి దాడిలో ఎద్దు మృతిచెందినట్లు గుర్తించారు.
సిర్పూర్ రేంజ్ మేడిపల్లి ప్రాంతం ఉండటంతో పెద్ద పులుల సంచారం పెరిగింది. మేడిపల్లితోపాటు సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు.
