
- మేత కోసం వెళ్లిన దూడను చంపిన పెద్దపులి
- ఘటనాస్థలాన్ని పరిశీలించి పాదముద్రలు గుర్తించిన ఆఫీసర్లు
మల్హర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం రాజయ్య అనే వ్యక్తికి చెందిన దూడ మేత కోసం మూడు రోజుల కింద అడవిలోకి వెళ్లింది. తర్వాత తిరిగి రాకపోవడంతో చుట్టు పక్క ప్రాంతాల్లో, అడవిలో వెతికినా జాడ దొరకలేదు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు.
దీంతో ఆఫీసర్లు ఎడ్లపల్లి, రుద్రారం శివారులో గాలించగా ఎడ్లపల్లి అడవుల్లో దూడ కళేబరం కనిపించింది. దూడను పెద్దపులి చంపినట్లు కొయ్యూరు ఫారెస్ట్ రేంజర్ రాజేశ్వరరావు ప్రకటించి, పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఘటనాస్థలాన్ని సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్వో నవీన్రెడ్డి పరిశీలించారు. ప్రజలు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని, రాత్రిపూట అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.