- ఎస్పీ మహేశ్ బి.గితే
వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 27న జరగనున్న సీతారాముల కల్యాణానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ మహేశ్ బి.గీతే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆలయ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలు, శివార్చన ప్రదేశం, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివార్చన వేదికపై సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారని, భక్తులకు సులభంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని తెలిపారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. అనంతరం వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరించారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా విలేజ్ పోలీస్ ఆఫీసర్ (వీపీవో) వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వీరప్రసాద్, ఈ ఈ రాజేశ్, డీఈ రఘునందన్, రామ్కిషన్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
