
తిరుమల: కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా 2025, సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది. అంటే దాదాపు దాదాపు 12గంటల పాటు తిరుమల ఆలయాన్ని క్లోజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది.
సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సెప్టెంబర్ 8 ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.
సెప్టంబర్ 7న ఆర్జితసేవలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీన ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే, చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ పున: ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాదాల వితరణ ఉండదు.
భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు. శ్రీ వారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా టీటీడీ సూచించింది.