ఉగాది రోజున శ్రీవారి మూల విరాట్టుకు నూతన వస్త్రాలంకరణ

ఉగాది రోజున శ్రీవారి మూల విరాట్టుకు నూతన వస్త్రాలంకరణ

ఉగాది సందర్భంగా  తిరుమల శ్రీవారి మూల విరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేయనున్నారు.  రేపు (ఏప్రిల్ 9) తెలుగువారి సంవత్సరాది... ఉగాది. ..శ్రీ క్రోధి నామ సంవత్సర ఆగమనం సందర్భంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. రేపు వేకువ జామున 3 గంటలకు సుప్రభాతం, ఆ తర్వాత ఆలయ శుద్ధి నిర్వహించనున్నారు. 

ఉదయం 6 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి విశేష నైవేద్య సమర్పణ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ఆలయ ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులను నూతన వస్త్రాలతో అలంకరిస్తారు. 

అనంతరం, ఆలయ బంగారు వాకిలిలో ఆగమ శాస్త్ర పండితులు, అర్చకులతో పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, ఉగాది సందర్భంగా అష్ట దళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం వంటి కైంకర్యాలను టీటీడీ రద్దు చేసింది.