
మొత్తం 42 సీట్లు తృణమూల్కే: మమత
కోల్కత: బెంగాల్ లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని, మొత్తం 42సీట్లు తమ పార్టీనే గెలుచుకుంటుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం హౌరా జిల్లాలో టీఎంసీ క్యాండిడేట్ ప్రసన్ బెనర్జీకి మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమత బీజేపీపై విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో బెంగాల్లో రెండు సీట్లు గెలుపొందిన బీజేపీకి ఈసారి గుండుసున్నానే వస్తుందన్నారు. ఇప్పటికే 300 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు ముగిసాయని, రాజస్థాన్, యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమైందని అన్నారు. ఇక ఆ పార్టీ కన్ను బెంగాల్పై పడిందని, బీజేపీ..ఆ పార్టీ కోసం పనిచేసే మైండ్సెట్ ఉన్నవాళ్లని బెంగాల్ ప్రజలు ఓడించడం సాధారణమేనని అన్నారు.
‘‘అధికారంలోకి రాగానే బెంగాల్లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్సిటిజన్షిప్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని ఓ వ్యక్తి చెప్పి వెళ్లారు. వాళ్లు అధికారంలోకైతే రానీ.. అప్పుడు చూస్తాం మేముండగా వాళ్లెలా అమలు చేస్తారో’’ అంటూ పేరు వెల్లడించకుండా అమిత్షా ను ఉద్దేశించి హెచ్చరించారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ఆ పార్టీ విధానాల కారణంగా 12వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రామ మందిరం గురించి మాట్లాడుతుందని, గడిచిన ఐదేళ్లలో ఆ పార్టీ చిన్న రామ మందిరమైనా నిర్మించిందా? అంటూ ప్రశ్నించారు. ఓట్లడిగేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రం గురించి ఏమీ తెలియదన్నారు. టెర్రరిస్టులకు నిధులు అందుతున్నాయని పెద్ద నోట్లను రద్దు చేసిన మోడీ.. రాబోయే రోజుల్లో డబ్బులుండట్లేవని బ్యాంకులను కూడా మూసేస్తారేమో అని ఎగతాళి చేశారు.