ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరో కీలక అంకానికి రంగం సిద్ధమైంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కోసం ప్లేయర్ల ఆక్షన్ సోమవారం ముంబైలో జరగనుంది. ఐదు ఫ్రాంచైజీల్లో అందుబాటులో ఉన్న 90 స్లాట్స్ కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి వస్తున్నారు. వీరిలో ఇండియా స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, టీనేజ్ సెన్సేషన్ షెఫాలీ వర్మ ఫేవరెట్లుగా నిలిచారు. వీరికోసం ఫ్రాంచైజీలు కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఫారిన్ ప్లేయర్లలో అలీసా హీలీ, బెత్ మూనీ, ఎలైస్ పెర్రీ, నటాలీ సివర్, మేగన్ షుట్, దియేంద్ర డాటిన్ తదితరులపై కూడా నోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ ప్లేయర్ల కోసం బిడ్ వేయనున్నాయి. ప్లేయర్ల ఆక్షన్ కోసం ఒక్కో టీమ్ రూ. 12 కోట్లు ఖర్చు చేయొచ్చు. ఒక్కో టీమ్లో టీమ్లో మ్యాగ్జిమమ్ 18 మందికి అనుమతిస్తారు. ఇందులో ఆరుగురు ఫారిన్స్ ఉండాలి. కనీసం 15 మందిని అయినా తీసుకోవాలి. ముంబైకి చెందిన మల్లికా సాగర్ డబ్ల్యూపీఎల్ ఆక్షనీర్గా వ్యవహించనుంది.
స్టార్లవైపు మొగ్గు!
యాక్షన్లో ప్లేయర్లు ఐదు బేస్ప్రైజ్( రూ. 10, 20, 30, 40, 50 లక్షలు) కేటగిరీల్లో రిజిస్టర్ అయ్యారు. రూ. 50 లక్షల కేటగిరీలో మంధాన, హర్మన్ సహా 24 మంది ఉన్నారు. తొలి ఎడిషన్ కావడంతో ముందుగా స్టార్ ప్లేయర్లను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడే చాన్సుంది. ఇండియా టీమ్లో స్మృతి, హర్మన్, షెఫాలీతో పాటు ఆల్రౌండర్ దీప్తి శర్మ రెండు కోట్ల వరకూ పలకొచ్చు. యంగ్ హిట్టర్ రిచా ఘోష్, సీమర్ రేణుకా ఠాకూర్, స్పిన్నర్లు గైక్వాడ్, రాధా యాదవ్, పేసర్లు మేఘనా సింగ్, శిఖా పాండేతో పాటు ఫారిన్ టీ20 లీగ్స్ అనుభవం ఉన్న జెమీమా రోడ్రిగ్స్ కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తం ఖర్చు చేయొచ్చు. అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో హైదరాబాదీ గొంగడి త్రిష, శ్వేత, పార్శవి, టిటాస్ సాధుపైనా ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఇక, ఐదు ఫ్రాంచైజీలకు ఐదుగురు కెప్టెన్లు అవసరమైన నేపథ్యంలో స్మృతి, హర్మన్తో పాటు మెగ్ లానింగ్, హీథర్ నైట్, సోఫీ డివైన్కు డిమాండ్ ఉంది.