బీజేపీ నిరుద్యోగ మార్చ్.. పెద్ద ఎత్తున తరలిరావాలని బండి సంజయ్ పిలుపు

బీజేపీ నిరుద్యోగ మార్చ్.. పెద్ద ఎత్తున తరలిరావాలని బండి సంజయ్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ రెండో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు, పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి పాలమూరు పరిధిలోని పోలింగ్ బూత్ ఇన్​చార్జీలతో సంజయ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతోపాటు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు రూ. లక్ష పరిహారం ఇచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ‘కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏండ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోంది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. పేపర్ లీకేజీ పేరుతో సర్కారు నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోంది. కేసీఆర్ కుటుంబంపైనే లీకేజీపై ఆరోపణలు వస్తున్నా .. కేసీ ఆర్ ఇంతవరకు స్పందించకపోవడం సి గ్గు చేటు. లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్ప టికీ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, కాపాడుకోవడానికి యత్నిస్తున్నారు’ అని సంజయ్​ ధ్వజమెత్తారు.

సిట్ పేరుతో దోషులను కాపాడే ప్రయత్నం

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే.. సీఎం మాత్రం సిట్ పేరుతో దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్​ఆరోపించారు. సిట్ చేసిన విచారణలకు ఇంతవరకు అతీగతీ లేదన్నారు. నయీం ఆస్తులు, డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఈ విషయాలను  తాము ప్రస్తావిస్తుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీక్ పేరుతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అన్నారు. అయినా తాను భయపడలేదని, తనను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుంచి నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చూపామన్నారు.