
ఆటలోనే కాదు.. ఆర్జనలోనూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. ఫోర్బ్స్ రిచ్చెస్ట్ అథ్లెట్ల జాబితాలో చోటు సంపాదించిన విరాట్.. మరో ఘనతను కూడా సాధించాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ మొత్తం సంపాదిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 274 మిలియన్ల ఫాలోవర్స్ కలిగివున్న కోహ్లీ.. ఇన్స్టాగ్రామ్లో ఒక్కో పోస్టుకు రూ.12 కోట్లు ఆర్జిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టా సంపాదనలో విరాట్ కోహ్లీ 14 స్థానంలో ఉండగా.. ఇండియా తరపున అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇన్స్టా సంపాదనలో ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (658 మిలియన్), మెస్సి (505 మిలియన్) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ.27 కోట్లు వసూలు చేస్తుండగా.. మెస్సి రూ.22 కోట్లు వసూలు చేస్తున్నారు. కాగా, కోహ్లీ నికర విలువ రూ.1000 కోట్లకు పైనే ఉన్నట్టు సమాచారం. ఇంస్టాగ్రామ్ సంపాదనలో కోహ్లీ మాత్రమే ఇండియా నుంచి టాప్- 20 లో ఉన్నాడు.
రూ.80 కోట్ల విలువైన ఇల్లు
కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.1050 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్లో రూ.80 కోట్ల విలువైన మరో ఇల్లు ఉన్నట్లు తెలిపింది. ఇక రన్ మెషిన్ వద్ద ఉన్న కార్ల విలువ రూ.30 కోట్ల పైమాటే. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చూనర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లున్నాయి.
బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల
కోహ్లీకి క్రికెట్ పరంగా బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. దీనికి అదనంగా మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక్కో టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇవి కాకుండా ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున ఆడుతున్నందకు రూ.21 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు.
వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7 నుంచి 10 కోట్లు
కోహ్లీ వ్యాపార ప్రకటనల ద్వారాఎక్కువ మొత్తం ఆర్జిస్తున్నాడు. రోజుకు రూ.7 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నాడు. వివో, మింత్రా, గ్రేట్ లర్నింగ్, నాయిస్, వ్రాగన్, బ్లూస్టార్, టూయమ్మీ, ఓలిని, లక్సర్, హెచ్ఎస్బీసీ, ఊబర్, టూత్సీ, స్టార్ స్పోర్ట్స్, అమెరికన్ టూరిస్టర్, ఎమ్ఆర్ఎప్, సింథాల్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు.
పెట్టుబడులు..
కోహ్లీకి సొంతంగా రెండు రెస్టారెంట్స్(One 8, Nueva) ఉన్నాయి. ఇవి కాకుండా ఫుట్బాల్ క్లబ్, టెన్నిస్ టీమ్, ప్రో రెజ్లింగ్ లీగ్ల్లో కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఎమ్పీఎల్, డిజిట్, కాన్వో, యూనివర్సల్ స్పోర్ట్స్బిజ్, బ్లూట్రైబ్ వంటి కంపెనీల్లో కోహ్లీ పెట్టుబడులు పెట్టాడు. కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి SeVVA'అనే ఎన్జీవోను కూడా నడిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ పేరిట పేద విద్యార్థులు, క్రికెటర్లకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాడు.