కొత్తగూడెంపై బీజేపీ అగ్రనేతల గురి

కొత్తగూడెంపై బీజేపీ అగ్రనేతల గురి
  •     నేడు కొత్తగూడెం రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
  •      రేపు రోడ్​షో నిర్వహించనున్న బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​
  •      ఇప్పటికే కాంగ్రెస్​ బడా లీడర్ల పర్యటన కంప్లీట్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం లోక్​సభ పరిధిలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంపై పొలిటికల్​ పార్టీల అగ్ర నేతలు గురిపెట్టారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఆర్​ఎస్​అధినేత కేసీఆర్​ పర్యటించనున్నారు. కాంగ్రెస్​ క్యాండిడేట్​ రామసహాయం రాఘురాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇప్పటికే కొత్తగూడెంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఆయా పార్టీల కార్యకర్తల్లో జోష్​ నింపేందుకు అగ్ర నేతల పర్యటనలు ఎంతగానో దోహదపడుతాయని పలువురు పొలిటికల్ లీడర్లు పేర్కొంటున్నారు. 

నేడు జేపీ నడ్డా రాక.. సభకు భారీ ఏర్పాట్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం ఖమ్మం లోక్​సభ పరిధిలోని కొత్తగూడెం అసెంబ్లీ సిగ్మెంట్​లో పర్యటించనున్నారు. ఖమ్మం బీజేపీ క్యాండిడేట్​తాండ్ర వినోద్​ రావు విజయాన్ని కాంక్షిస్తూ  కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీ నడ్డా పర్యటనను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జాతీయ పదాధికారి పొంగులేటి సుధాకర్​రెడ్డి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్​ ఆధ్వర్యంలో ఇప్పటికే కొత్తగూడెంలో ముఖ్య కార్యకర్తల మీటింగ్​పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటును గెలుచుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ క్రమంలో లోక్​సభ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కొత్తగూడెంలో పర్యటించనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 

కేసీఆర్​ రోడ్​ షో సక్సెస్​కు పలు ప్రయత్నాలు 

ఖమ్మం బీఆర్​ఎస్​అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్​ కొత్తగూడెంలో మంగళవారం రోడ్​ షో నిర్వహించనున్నారు. కేసీఆర్​ రోడ్​ షోను సక్సెస్ ​ చేసేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గానూ భద్రాచలం సీటును మాత్రమే బీఆర్​ఎస్​ గెలుచుకుంది. కానీ ఇటీవల ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. మరో వైపు కేసీఆర్​ రోడ్​ షోకు ముందే ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్​లో చేరడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. ఒక్కొక్కరుగా ముఖ్య నేతలంతా కాంగ్రెస్​లో చేరుతుండడం ఆ పార్టీ అగ్ర నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

నేతలను సమాయత్తం చేసిన పొంగులేటి..

ఖమ్మం లోక్​సభకు కాంగ్రెస్​ నుంచి పోటీ చేస్తున్న రామసహాయం రాఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి కొత్తగూడెంలో శనివారం ప్రచారం ప్రారంభించారు. మిత్ర పక్షాలైన సీపీఐ, సీపీఎం, టీజేఎస్​ నేతలతో పాటు కాంగ్రెస్​ లీడర్లతో కలిసి కో ఆర్డినేషన్​ కమిటీలు వేశారు. ప్రచార వేగాన్ని ముమ్మరం చేసే విధంగా మంత్రి దిశా నిర్దేశం చేశారు.