
- ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు
- సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు
- కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్ లీడర్లు
మహబూబ్నగర్, వెలుగు: టీపీసీసీలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసింది. మూడు రోజుల క్రితం ఈ జిల్లాకు చెందిన బీసీ కేటగిరిలోని ముదిరాజ్సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వగా.. తాజాగా రిలీజ్చేసిన తెలంగాణ ప్రదేశ్కాంగ్రెస్కమిటీలో ఒకరికి ఉపాధ్యక్ష, ఐదుగురికి ప్రధాన కార్యదర్శులుగా చోటు కల్పించింది. వైస్ ప్రెసిడెంట్గా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, జనరల్ సెక్రటరీలుగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెంపర్ణికా రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, ఏపీ మిథున్రెడ్డి, ఎం.రాజీవ్ రెడ్డి, నందిమళ్ల యాదయ్య ముదిరాజ్ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్నుంచి ఉత్తర్వులు అందాయి.
సామాజిక కోణం.. ప్రతి జిల్లాకు అవకాశం
టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు కేటాయించారు. మొత్తం ఆరు పదవులు ఇవ్వగా.. అందులో రెండు బీసీలు, ఒక ఎస్సీ, మూడు ఓసీలకు ఇచ్చారు. బీసీలకు కేటాయించిన రెండు పదవులు ముదిరాజ్సామాజిక వర్గానికి చెందిన వనపర్తి జిల్లా వాసి నందిమల్ల యాదయ్య, మహబూబ్నగర్జిల్లా వాసి సంజీవ్ ముదిరాజ్లకు.. ఎస్సీ సామాజిక వర్గం నుంచి నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు, ఓసీ కేటగిరిలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఏపీ మిథున్ రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎం.రాజీవ్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా.. మిగిలిన వారు నియోజకవర్గ స్థాయి లీడర్లు. ఇందులో యాదయ్య కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. దాదాపు 32 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు.
దీంతో ఆయనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. సంజీవ్ ముదిరాజ్ కూడా మూడు దశాబ్దాలకు పైగానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గత టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఈయన ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం రెండో సారి ఆయనకు ఈ అవకాశం దక్కింది. మరో ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు కాగా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు.
యూత్లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. కాంగ్రెస్లో చేరాక పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. సమీకరణాల ఆధారంగా హైకమాండ్ఈయనకు ప్రధాన కార్యదర్శి పోస్ట్ఇచ్చింది. మరో యూత్ లీడర్ ఎం.రాజీవ్ రెడ్డి దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నాడు. దీంతో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ అవకాశం
కల్పించింది.
పాలమూరు డీసీసీపై చర్చ
రానున్న వారం రోజుల్లో డీసీసీలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీసీసీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు డీసీసీ గురించి ప్రస్తావించినట్లు తెలిసింది.
జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని ఈసారి ఇచ్చే నామినేటెడ్ పోస్టులు, డీసీసీలను బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇందుకు రాష్ర్ట ఇన్చార్జి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. త్వరలో డీసీసీలను ప్రకటిస్తామని ఆమె సమీక్షలో ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం.