టీపీసీసీలో.. పాలమూరుకు పెద్దపీట

టీపీసీసీలో..  పాలమూరుకు పెద్దపీట
  • ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురికి చోటు
  • సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు
  • కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యూత్​ లీడర్లు

మహబూబ్​నగర్, వెలుగు: టీపీసీసీలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసింది. మూడు రోజుల క్రితం ఈ జిల్లాకు చెందిన బీసీ కేటగిరిలోని ముదిరాజ్​సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వగా..  తాజాగా రిలీజ్​చేసిన తెలంగాణ ప్రదేశ్​కాంగ్రెస్​కమిటీలో ఒకరికి ఉపాధ్యక్ష, ఐదుగురికి ప్రధాన కార్యదర్శులుగా చోటు కల్పించింది. వైస్​ ప్రెసిడెంట్​గా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, జనరల్​ సెక్రటరీలుగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెంపర్ణికా రెడ్డి, సంజీవ్​ ముదిరాజ్, ఏపీ మిథున్​రెడ్డి, ఎం.రాజీవ్​ రెడ్డి, నందిమళ్ల యాదయ్య ముదిరాజ్​ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​నుంచి ఉత్తర్వులు అందాయి.

సామాజిక కోణం..   ప్రతి జిల్లాకు అవకాశం

టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణల ఆధారంగా పదవులు కేటాయించారు. మొత్తం ఆరు పదవులు ఇవ్వగా.. అందులో రెండు బీసీలు, ఒక ఎస్సీ, మూడు ఓసీలకు ఇచ్చారు.  బీసీలకు కేటాయించిన రెండు పదవులు ముదిరాజ్​సామాజిక వర్గానికి చెందిన వనపర్తి జిల్లా వాసి నందిమల్ల యాదయ్య, మహబూబ్​నగర్​జిల్లా వాసి సంజీవ్​ ముదిరాజ్​లకు..  ఎస్సీ సామాజిక వర్గం నుంచి నాగర్​కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​ చిక్కుడు వంశీకృష్ణకు, ఓసీ కేటగిరిలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన ఏపీ మిథున్​ రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఎం.రాజీవ్​ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా.. మిగిలిన వారు నియోజకవర్గ స్థాయి లీడర్లు.  ఇందులో యాదయ్య కాంగ్రెస్​ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. దాదాపు 32 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. 

దీంతో ఆయనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. సంజీవ్​ ముదిరాజ్​ కూడా మూడు దశాబ్దాలకు పైగానే కాంగ్రెస్​ పార్టీలో కొనసాగుతున్నారు. గత టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఈయన ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం రెండో సారి ఆయనకు ఈ అవకాశం దక్కింది. మరో ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్​ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు కాగా ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 

యూత్​లో ఈయనకు మంచి ఫాలోయింగ్​ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్​నగర్​అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.  కాంగ్రెస్​లో చేరాక పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్​గా పాల్గొంటున్నారు. సమీకరణాల ఆధారంగా హైకమాండ్​ఈయనకు ప్రధాన కార్యదర్శి పోస్ట్​ఇచ్చింది. మరో యూత్​ లీడర్​ ఎం.రాజీవ్​ రెడ్డి దశాబ్దకాలంగా కాంగ్రెస్​ పార్టీలో ఉంటున్నారు.  పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్​గా పాల్గొంటున్నాడు.  దీంతో ఆయనకు ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్​ అవకాశం 
కల్పించింది. 

పాలమూరు డీసీసీపై చర్చ

రానున్న వారం రోజుల్లో డీసీసీలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇటీవల పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో డీసీసీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మహబూబ్‌‌‌‌​నగర్​ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు డీసీసీ గురించి ప్రస్తావించినట్లు తెలిసింది.  

జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీల్లో ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారని ఈసారి ఇచ్చే నామినేటెడ్​ పోస్టులు, డీసీసీలను బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.  ఇందుకు రాష్ర్ట ఇన్​చార్జి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.  త్వరలో డీసీసీలను ప్రకటిస్తామని ఆమె సమీక్షలో ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం.