
భద్రాద్రి: రాష్ట్రంలో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (మే 31) భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇష్యూ కేసీఆర్ కుటుంబ కుంపటి.. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్లు రోడ్డున పడ్డారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయా ముఖచిత్రంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. కవిత చెప్పిన వాటిలో కొన్ని విషయాలు వాస్తవాలు ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాన్ని కవిత బహిర్గతం చేసిందని అన్నారు. వీటన్నింటికి బీఆర్ఎస్, బీజేపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి ఇంకా యువ మోర్చా నాయకుడిలాగా మాట్లాడుతున్నాడుని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభివృధ్ది, సంక్షేమం విషయంలో స్పష్టత ఉందన్నారు.బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుంది.. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి బీఆర్ఎస్ అవినీతిని ఆపలేకపోయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే కమిషన్లు చర్యలకు పూనుకుందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ప్రజా ధనాన్ని దోపిడి చేశాయని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వేసిన ప్రశ్నలకు బండి సంజయ్, కిషన్ రెడ్డి జవాబు చెప్పి.. ఆ తర్వాత మాట్లాడాలని చురకలంటించారు. ఇందిరా గాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ గిరిజన, ఆదీవాసీ హక్కులను కాపాడుతూనే ఉందని.. లంబాడ, కోయ, గోండులను ఆదుకోవాలనే ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి ఉందని పేర్కొన్నారు.