‘క్విట్ తెలంగాణ’: 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం 

‘క్విట్ తెలంగాణ’: 20 నెలల్లో సోనియమ్మ రాజ్యం 

హైదరాబాద్: లక్షలాది మంది త్యాగాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 79 ఏండ్లు నిండాయి. ఈ నేపథ్యంలో జాతిపిత మహాత్మా  గాంధీని స్మరించుకుంటూ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ వేడుకలు నిర్వహించింది. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సాధించాలి లేదా ప్రాణాలైనా వదలాలనే నినాదం దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిందన్నారు. 

‘సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరే ప్రత్యామ్యాయాన్ని అంగీకరించేది లేదని మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం దేశమంతా వ్యాపించింది. భారత్‌ను ప్రపంచం ముందు  శక్తిమంతమైన దేశంగా కాంగ్రెస్ నిలిపింది. కానీ ఏడేళ్ల పాలనలో మోడీ దేశాన్ని అప్పులపాలు చేశారు. మోడీ, కేసీఆర్ అధికారం చేపట్టాక బ్రిటీష్ విధానాలను అవలంభిస్తున్నారు. ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తున్నారు. తెలంగాణను సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేశారు. సోనియా ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఇచ్చారో ఆ  ఆకాంక్షలు నెరవేరలేదు’ అని రేవంత్ పేర్కొన్నారు.

‘శక్తిమంతమైన దేశంగా ఎదగాల్సిన ఇండియాను రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి  బానిసలుగా చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోంది. జీడీపీని పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ.. గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరలు పెంచి పేదవాడి నడ్డి విరిచారు. మోడీ హయాంలో పేదోళ్లు బతికే పరిస్థితి లేదు. వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్లేందుకు కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితి నెలకొంది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేతిలో, 130 కోట్ల మంది మోడీ చేతిలో బందీ అయ్యారు. కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం క్విట్ తెలంగాణ ఉద్యమానికి యువత ముందుకు రావాలి. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకురావాలి. స్వేచ్ఛ, సామజిక న్యాయం కోసం 20 నెలలు కష్టపడదాం. ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ఒకరు ముందుకు రావాలి’ అని రేవంత్ పిలుపునిచ్చారు.