హైదరాబాద్ సిటీ, వెలుగు: గోషామహల్ లోని దారుసలాం ప్రాంతంలో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనుల కారణంగా 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ తెలిపారు. దారుసలాంలోని ఎస్బీఐ నుంచి చాకన్వాడీ కల్వర్టు వరకు బాక్స్ డ్రెయిన్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్టు చెప్పారు.
మల్లేపల్లి, బోయిగూడ కమాన్, ఆఘాపురా నుంచి అలస్కా టీ జంక్షన్ వైపు రూట్ లో వచ్చే వాహనాలను దారుసలాం వద్ద ఏక్-మినార్ మసీదు వైపు, అలాగే, అలాస్కా జంక్షన్ నుంచి దారుసలాం వైపు రూట్లో వెళ్లే వాహనాలను కలకత్తా స్వీట్ హౌస్ వద్ద చాకన్వాడీ ఇంటర్నల్రోడ్ల మీదుగా మళ్లించినట్లు చెప్పారు.
తాజా ట్రాఫిక్ అప్డేట్ల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలన్నారు. ఏదైనా అత్యవసమైతే 9010203626 నంబర్కు కాల్చేయవచ్చన్నారు.
